Blackmail: మార్ఫింగ్‌ ఫొటోలతో.. మహిళా జడ్జికే బెదిరింపులు..!

మార్ఫింగ్‌ ఫొటోలతో (Morphed Photos) మహిళా జడ్జినే ఓ వ్యక్తి బెదిరించిన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. రూ.20లక్షల ఇవ్వకుంటే వాటిని బహిర్గతం చేస్తానని బెదిరించడంతో (Blackmail).. దీంతో సదరు జడ్జి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Published : 09 Mar 2023 14:16 IST

జైపుర్‌: ఓ మహిళా న్యాయమూర్తికి సంబంధించిన ఫొటోలను మార్ఫింగ్‌ చేసి (Morphed Photos) ఓ వ్యక్తి బెదిరింపులకు (Blackmail) దిగడం రాజస్థాన్‌లో కలకలం రేపింది. తనకు రూ.20లక్షలు ఇవ్వాలని.. లేదంటే వాటిని బహిర్గతం చేస్తానంటూ బ్లాక్‌మెయిల్‌ చేశాడు. దీంతో అప్రమ్తమైన ఆ మహిళా న్యాయమూర్తి (Woman Judge) పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన జైపుర్‌ పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

మహిళా జడ్జికి సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్‌ మీడియా ఖాతా నుంచి ఓ వ్యక్తి డౌన్‌లోడ్‌ చేసి మార్ఫింగ్‌ చేశాడు. అనంతరం కోర్టులోని న్యాయమూర్తి ఛాంబర్‌తోపాటు ఆమె ఇంటికీ వాటిని పంపించాడు. స్టెనోగ్రాఫర్‌ ద్వారా ఓ పార్శిల్‌ను అందుకున్న జడ్జి.. వాటిని చూసి కంగుతిన్నారు. అందులో కొన్ని స్వీట్లు, అసభ్యకరమైన ఫొటోలతో పాటు ఓ బెదిరింపు లేఖ కూడా ఉంది. రూ.20లక్షలతో సిద్ధంగా ఉండాలని.. లేదంటే ఫొటోలను బహిర్గతం చేసి జీవితాన్ని నాశనం చేస్తానంటూ మహిళా న్యాయమూర్తిని హెచ్చరించాడు. జడ్జి చిన్ననాటి స్నేహితుడినని లేఖలో పేర్కొన్న ఆ వ్యక్తి.. ఎప్పుడు, ఎక్కడకు నగదు పంపించాలో త్వరలోనే తెలియజేస్తానని పేర్కొన్నాడు.

మరో 20 రోజుల తర్వాత అటువంటి పార్శిల్‌నే మళ్లీ వచ్చింది. పార్శిల్‌ ఇచ్చిన వ్యక్తి పేరును స్టెనో ప్రశ్నించగా.. ఏమీ మాట్లాడకుండానే అక్కడి నుంచి  పారిపోయాడు. దీంతో ఆ మహిళా న్యాయమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు.. కోర్టు ప్రాంగణంలోని సీసీటీవీలను పరిశీలించారు. న్యాయమూర్తి ఛాంబర్‌కు పార్శిల్‌ పట్టుకొచ్చిన వ్యక్తిని గుర్తించారు. అతడి వయసు సుమారు 20ఏళ్ల ఉంటుందని అనుమానిస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు జైపుర్‌ పోలీసులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు