Crime news: పార్కింగ్‌ వివాదం.. ఇటుకతో తల పగలగొట్టి చంపాడు!

కారు పార్కింగ్‌ విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.

Published : 26 Oct 2022 16:11 IST

ఘజియాబాద్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కారు పార్కింగ్‌ విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఓ వ్యక్తిపై ఇటుకతో కిరాతకంగా తలను పగులగొట్టి చంపిన భయానక ఘటన ఘజియాబాద్‌లోని గత రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. వరుణ్‌ (35) అనే వ్యక్తి తను నివాసం ఉండే ప్రాంతానికి సమీపంలో ఉన్న ఓ దాబాకు వెళ్లాడు. తన కారును అక్కడే పార్కింగ్‌ చేశాడు. అయితే, పక్కనే ఉన్న మరో వాహనం డోరు తీసేందుకు వీలు లేని విధంగా కారును పార్కింగ్‌ చేసి ఉండటం వివాదానికి కారణమైంది. దీంతో ఆ కారు యజమాని వరుణ్‌తో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ మరింత తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన నిందితుడు వరుణ్‌ తలపై ఇటుకతో గట్టిగా మోదాడు. తీవ్ర గాయాలతో కింద పడిపోయిన వరుణ్‌ను అక్కడే వదిలేసిన నిందితుడు తన స్నేహితులతో కలిసి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో వరుణ్‌ను ఆస్పత్రికి తరలించగా అతడు అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. వరుణ్‌ డెయిరీ వ్యాపారం నిర్వహిస్తుండగా.. అతడి తండ్రి మాజీ పోలీస్‌ అధికారి అని సమాచారం. 

ఈ ఘటన దృశ్యాలను కొందరు రికార్డు చేయగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఘజియాబాద్‌లో శాంతిభద్రతల పరిస్థితి బాగాలేదని, వీధుల్లో ఇలాంటి హింసాత్మక ఘటనల్ని నివారించడంలో పోలీసులు వైఫల్యం చెందారంటూ విమర్శలు వస్తున్నాయి. మరోవైపు, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పీ వెల్లడించారు. నిందితులను పట్టుకొనేందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని