Cyber Crime: రూ.5 జీఎస్టీ కట్టాలని చెప్పి.. రూ.లక్ష కాజేశాడు!

కొరియర్‌ చేసిన తన పార్శిల్‌ను వెతికే క్రమంలో సైబర్‌ మోసం బారిన పడ్డారో ముంబయి వ్యక్తి. రూ.5 జీఎస్టీ కట్టాలని చెప్పి ఆయన వద్ద నుంచి ఓ సైబర్‌ నిందితుడు రూ.లక్ష కాజేశాడు.

Published : 03 Jun 2023 01:57 IST

ముంబయి: తన పార్శిల్‌ ఎక్కడుందో తెలుసుకునేందుకు యత్నించిన ఓ వ్యక్తి.. సదరు కొరియర్‌ సంస్థ పేరును ఆన్‌లైన్‌లో తప్పుగా టైప్‌ చేసి, ఈ క్రమంలోనే రూ.లక్ష పోగొట్టుకున్నారు. ముంబయి (Mumbai)లో ఈ వ్యవహారం (Cyber Crime) వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఇక్కడి మలాడ్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తి (69) ఇటీవల బెంగళూరు నుంచి ముంబయికి వచ్చారు. తనవద్ద ఉన్న అదనపు లగేజీని ముందుగానే కొరియర్‌ (Courier)లో పంపించారు. తదనంతరం తన లగేజీ ఎక్కడుందో తెలుసుకునేందుకుగానూ సదరు కొరియర్‌ సంస్థ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం ఆన్‌లైన్‌లో వెతికారు.

అయితే, పొరపాటున తప్పుడు పేరు టైప్‌ చేయడంతో వేరే నంబర్‌ లభ్యమైంది. దాన్ని సంప్రదించగా.. ఓ వ్యక్తి తనను తాను రాహుల్‌ శర్మగా పరిచయం చేసుకున్నాడు. కొరియర్ ఛార్జీలపై రూ.5 జీఎస్టీ చెల్లించనందున పార్శిల్ నిలిచిపోయిందని నమ్మించాడు. ఈ విషయంలో సహాయపడతానన్న నెపంతో.. ఆయన బ్యాంకు ఖాతాతో అనుసంధానమై ఉన్న యూపీఐ వివరాలు రాబట్టాడు. ఈ క్రమంలోనే బాధితుడి అకౌంట్‌ నుంచి రూ.లక్ష బదిలీ చేసుకున్నాడు. కొద్దిసేపటికి ఈ విషయాన్ని గుర్తించిన బాధితుడు.. మోసపోయానంటూ పోలీసులను ఆశ్రయించారు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని