Crime News: ముంబయిలో సహజీవన భాగస్వామిని ముక్కలు చేసి..ఆపై కుక్కర్‌లో ఉడికించి..!

Crime News: వాణిజ్య రాజధాని ముంబయిలో దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. శ్రద్ధా వాకర్ ఘటన తరహాలోనే ఓ మహిళ హత్యకు గురైంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 

Updated : 08 Jun 2023 13:12 IST

దిల్లీ: శ్రద్ధావాకర్‌(Shraddha Walkar)హత్య కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇంకా దానిని మర్చిపోకముందే అదే తరహాలో మహారాష్ట్ర రాజధాని ముంబయిలో మరోకేసు వెలుగుచూసింది. తన సహజీవన భాగస్వామి(Live-In-Partner)ని హత్యచేసి, ఆమె శరీర భాగాలను ముక్కలుగా చేసిన వ్యక్తిని బుధవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాలు ప్రకారం.. 

56 ఏళ్ల వయస్సున్న మనోజ్‌ సహానీ.. సరస్వతి వైద్యతో మూడేళ్లుగా సహజీవనంలో ఉన్నారు. వారిద్దరు ముంబయిలోని మీరా రోడ్డులోని ఓ ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. అయితే నిన్న వారు ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో సరస్వతి హత్య గురించి వెలుగులోకి వచ్చింది. 

ఆ ఇంట్లో మృతురాలి శరీర భాగాల ముక్కలను పోలీసులు గుర్తించారు. దాదాపు నాలుగు రోజుల క్రితమే ఆమె హత్య జరిగినట్లు వారు అంచనావేశారు. వారిద్దరి మధ్య జరిగిన గొడవే ఈ దారుణానికి కారణమై ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. ఈ హత్యను దాచిపెట్టేందుకు అతడు యత్నించాడని తెలిపారు. ఆమె శరీర భాగాల్లో కొన్నింటిని నిందితుడు కుక్కర్‌లో ఉడికించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. ‘మేం మృతురాలికి న్యాయం చేయడానికి కట్టుబడి ఉన్నాం. ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలిసినవారు మమ్మల్ని సంప్రదించాలని కోరుతున్నాం’అని డీసీపీ జయంత్ బజ్‌బలే స్థానికులను అభ్యర్థించారు. మనోజ్‌.. బోరివాలీ ప్రాంతంలో ఒక దుకాణం నడుపుతున్నాడని స్థానికులు తెలిపారు. మృతురాలు సరస్వతి అనాథగా గుర్తించారు. 

గత ఏడాది వెలుగులోకి వచ్చిన శ్రద్దావాకర్‌ హత్యను తాజా ఘటన గుర్తుకుతెస్తోంది. కాల్ సెంటర్ ఉద్యోగిని శ్రద్ధాను ఆమె సహజీవన భాగస్వామి ఆఫ్తాబ్‌ పూనావాలా అతి దారుణంగా హత్య చేసి, శరీరాన్ని 35 ముక్కలుగా చేశాడు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు ఆ భాగాలను 18 రోజుల పాటు దిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పారేశాడు. ఆమె తండ్రి ఫిర్యాదుతో ఆరు నెలల తర్వాత అతడి అకృత్యం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని