Rajasthan: మేనత్తను ముక్కలుగా నరికిన మేనల్లుడు

దేశ రాజధాని దిల్లీలో ప్రియుడి చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైన శ్రద్ధా వాకర్‌ ఘటన మరవకముందే రాజస్థాన్‌ రాజధానిలో అలాంటి ఘోరం చోటుచేసుకుంది.

Updated : 18 Dec 2022 08:39 IST

జైపుర్‌: దేశ రాజధాని దిల్లీలో ప్రియుడి చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైన శ్రద్ధా వాకర్‌ ఘటన మరవకముందే రాజస్థాన్‌ రాజధానిలో అలాంటి ఘోరం చోటుచేసుకుంది. జైపుర్‌కు చెందిన సరోజను ఆమె మేనల్లుడు అనూజ్‌ సుత్తితో కొట్టి చంపాడు. మృతదేహాన్ని పది ముక్కలుగా నరికి అడివిలో పాతిపెట్టాడు. సరోజకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.  భర్త 27 ఏళ్ల క్రితం చనిపోయాడు.  సరోజ బాగోగులను ఆమె మేనల్లుడు అనూజ్‌ చూసుకుంటున్నాడు. అతడి ఖర్చులను సరోజ భరించేది. మరోవైపు, తన మేనత్త కనిపించడం లేదని డిసెంబర్‌ 11న అనూజ్‌ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆవుకు మేత పెట్టేందుకు వెళ్లి ఇంటికి రాలేదని అందులో పేర్కొన్నాడు. అనంతరం సరోజ కుమార్తె పూజకు ఆ విషయాన్ని తెలియజేశాడు. అనూజ్‌పై అనుమానం రావడంతో పూజ ఎవరికీ చెప్పకుండా డిసెంబరు 13న జైపుర్‌ వచ్చింది. ఆ సమయంలో అనూజ్‌ వంటగదిలో రక్తపు మరకలను శుభ్రం చేస్తూ కనిపించాడు. ఇదేమిటని  నిలదీయగా.. తనకు ముక్కు నుంచి రక్తం కారినట్లు చెప్పాడు.  అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయాన్ని పూజ.. తన సోదరికి, పోలీసులకు చెప్పింది. రంగంలోకి దిగిన పోలీసులు.. అనూజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. తన పనులకు అంతరాయం కలిగించడం వల్లే సరోజను సుత్తితో కొట్టి చంపినట్లు తెలిపాడు. అనంతరం పది ముక్కలుగా నరికి అటవీ ప్రాంతంలో పాతిపెట్టినట్లు చెప్పాడు. అనూజ్‌ పాతిపెట్టిన శరీర భాగాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని