NIA: మావోయిస్టులతో సంబంధాలు... హైదరాబాద్‌లో ముగ్గురిని అరెస్టు చేసిన ఎన్‌ఐఏ

మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న అభియోగాలతో చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్‌) నాయకులు దేవేంద్ర, స్వప్న, హైకోర్టు న్యాయవాది శిల్పను జాతీయ దర్యాప్తు సంస్థ

Updated : 23 Jun 2022 19:17 IST

హైదరాబాద్‌: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న అభియోగాలతో చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్‌) నాయకులు దేవేంద్ర, స్వప్న, హైకోర్టు న్యాయవాది శిల్పను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు అరెస్టు చేశారు. 3 ఏళ్ల క్రితం తమ కుమార్తెను కిడ్నాప్‌ చేశారని 2017 డిసెంబరులో విశాఖలోని పెదబయలు పీఎస్‌లో రాధ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎంఎస్ నాయకులు... రాధను కిడ్నాప్ చేసి బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేర్చుకున్నారని ఆమె తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎంఎస్ నాయకులు దేవేంద్ర, స్వప్న, హైకోర్టు న్యాయవాది శిల్ప, తదితరులు తమ నివాసానికి వచ్చేవారని తెలిపారు. వైద్యం పేరుతో దేవేంద్ర.. రాధను తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

విశాఖ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఎన్‌ఐఏ అధికారులు శిల్పపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇవాళ ఉదయం ఉప్పల్‌ చిలుకానగర్‌లోని శిల్ప నివాసంలో, చైతన్య మహిళా సంఘం కార్యాలయంలో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు డిజిటల్‌ సామగ్రి, మావోయిస్టు భావజాల సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మెదక్‌ జిల్లా చేగుంటలోని మావోయిస్టు అగ్రనేత దుబాషి శంకర్‌ కుమారుడి ఇంట్లో తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహించారు. గతంలో ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ప్రభాకర్‌ భార్య, న్యాయవాది దేవేంద్రను మేడ్చల్‌ జిల్లాలోని మేడిపల్లి పర్వతాపూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. దేవేంద్ర, స్వప్న, శిల్ప ముగ్గురూ మావోయిస్టు అనుబంధ సంస్థ చైతన్య మహిళా సంఘంలో పనిచేస్తున్నట్టు ఎన్‌ఐఏ అధికారులు నిర్ధారణకు వచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని