Hyderabad: బామ్మర్ది ఎంత పనిచేశావ్‌.. డబ్బు కోసం ఇంత బరితెగింపా?

నమ్మకంగా ఉండాల్సిన కుటుంబ సభ్యులే డబ్బుకోసం బరితెగించడం పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఏసీపీ మోహన్ కుమార్ వెల్లడించారు.

Updated : 08 Feb 2023 18:22 IST

పంజాగుట్ట (హైదరాబాద్‌): భాగ్యనగరం (Hyderabad)లో కలకలం సృష్టించిన ఓ వ్యక్తి కిడ్నాప్‌ (kidnap) కేసును పంజాగుట్ట పోలీసులు ఛేదించారు. ఈ కేసులో బాధితుడి బామ్మర్దే సూత్రధారి అని తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు. నమ్మకంగా ఉండాల్సిన కుటుంబ సభ్యులే డబ్బుకోసం బరితెగించడం పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఏసీపీ మోహన్ కుమార్ వెల్లడించారు.

ఓవర్‌సీస్‌ జాబ్‌ కన్సల్టెంట్‌గా పని చేస్తున్న అమీర్‌పేట్‌కు చెందిన మురళీ కృష్ణ.. గత నెల 27న అమీర్‌పేట్‌ లాల్‌ బంగ్లా సమీపంలోని నీరజ్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పిల్లల్ని వదిలి వస్తుండగా ఇన్నోవా కారులో వచ్చిన ఐదుగురు అడ్డుకున్నారు. ఆదాయపన్ను అధికారులమని చెబుతూ మురళీకృష్ణను బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. అనంతరం నగర శివారులోని బాటసింగారంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. రూ.60 లక్షలు ఆదాయపు పన్ను చెల్లించాలన్నారు. అందుకు మురళీకృష్ణ అంగీకరించకపోవడంతో చేయి చేసుకున్నారు. అతడి బావమరిదిని అరెస్టు చేశామని చెప్పి.. అతనితో ఫోన్‌లో మాట్లాడించారు. చివరికి భార్యను కూడా అరెస్టు చేస్తామని బెదిరించారు. దీంతో భయపడిన మురళీ కృష్ణ.. తన భార్యకు జరిగింది చెప్పి.. రూ.30 లక్షలు సిద్ధం చేయించాడు. బావమరిదికి డబ్బులు ఇచ్చి.. నాంపల్లి వద్దకు నిందితుల్ని రప్పించారు. అక్కడ బ్యాగ్‌ తీసుకున్న తర్వాత.. నిందితులు మురళీకృష్ణను ఔటర్‌ రింగురోడ్డు వద్ద వదిలేశారు. అక్కడి నుంచి ఇంటికి చేరుకున్న బాధితుడు ఈనెల 4న పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని మొబైల్‌ సిగ్నల్స్‌, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేసి కేసును ఛేదించారు.

బాధితుడు మురళీకృష్ణ బావమరిది రాజేశ్‌.. ఈ కిడ్నాప్‌నకు ప్రధాన సూత్రధారి అని ఏసీపీ మోహన్‌ కుమార్‌ తెలిపారు‌. రాజేశ్‌ తనకు వరసకు సోదరుడైన విజయవాడకు చెందిన డి.రాఘవేంద్ర, అతనితోపాటు జీవన్‌ కుమార్‌, అబ్దుల్‌ సలీమ్‌, పలపు లక్ష్మయ్య, ఎ.కృష్ణ గోపాల్‌ (కిట్టు), శ్రీనివాస్‌(వాసు) తదితరులను గ్రూప్‌గా చేసుకొని ఈ కిడ్నాప్‌నకు పాల్పడ్డారు. అనంతరం మురళీకృష్ణ భార్య లావణ్యతో ఫోన్‌లో మాట్లాడి రూ.60లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆమె రూ.30లక్షలే ఉన్నాయని తన సోదరుడు రాజేశ్‌కు ఇచ్చి పంపింది. ఈ రూ.30లక్షలు అందిన తర్వాత మురళీకృష్ణను ఔటర్‌ రింగురోడ్డు వద్ద వదిలిపెట్టారు. రాజేశ్‌తో పాటు ఏడుగురిని నిందితులుగా గుర్తించారు. ఆరుగురిని అరెస్టు చేయగా గౌస్‌ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. కిడ్నాప్‌నకు ఉపయోగించిన ఇన్నోవాతో పాటు రూ.15.45లక్షల నగదు, ద్విచక్రవాహనం, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని