‘నీ భార్యని వదిలేయ్‌.. ఎమ్మెల్యే అవుతావు’

రఘునాథ్ రాజారామ్‌ ఎమూల్‌(48)కి ఎమ్మెల్యే అవ్వాలని కోరిక

Published : 14 Jul 2021 01:20 IST

భర్త, జ్యోతిష్యుడిని అరెస్టు చేసిన పోలీసులు

పుణె: కొందరు జాతకాలను నమ్ముతారు. మరికొందరు.. బాబాలు, జ్యోతిష్యుల చుట్టూ తిరుగుతూ మా దశ ఎప్పుడు మారుతుంది గురూజీ! అని అడుగుతుంటారు. ఇక అవే నమ్మకాలు అనర్థాలకు దారితీస్తే? సరిగ్గా ఇదే జరుగుతుందనడానికి పుణెలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. వివరాల్లోకి వెళ్తే.. పుణెకు చెందిన రఘునాథ్ రాజారామ్‌ ఎమూల్‌ (48)కి ఎమ్మెల్యే అవ్వాలని కోరిక. దీంతో బాబాల బాట పడ్డాడు. ఇక ఓ బాబా.. నీ భార్యని వదిలిస్తే..కచ్చితంగా ఎమ్మెల్యే, మంత్రి పదవులు వస్తాయని.. ఆమెతో కలిసి ఉన్నంతకాలం ఏ పదవీ దక్కదు’’ అంటూ మాయ మాటలు చెప్పాడు. ఆ మాటలను బలంగా నమ్మిన అతడు తన భార్య (27)ను వదిలించుకునేందుకు పన్నాగం రచించాడు. సూటి పోటి మాటలతో మానసికంగా వేధించేవాడు. అంతేకాదు  సిగరెట్లతో ఆమె శరీరంపై గాయాలు చేసేవాడు. అదనపు కట్నం తీసుకురావాలంటూ అత్తమామలు సైతం చిత్ర హింసలకు గురిచేసేవారు. దీంతో ఆ వేధింపులు భరించలేక ఆ మహిళ పోలీసు స్టేషన్‌లో.. భర్తతో సహా ఎనిమిది మందిపై కేసు పెట్టింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో బాబా చెప్పినట్టే తాను ప్రవర్తించానని రఘునాథ్‌ చెప్పాడు. మాయ మాటలు చెప్పి జనాలను మభ్యపెడుతున్న ఆ బాబాని అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని