Hyderabad: ఒక్క మిస్డ్‌ కాల్‌తో రెండు జీవితాలు బలి.. రాజేశ్‌ మృతి కేసులో కీలక ఆధారాలు

నగర శివారు పెద్ద అంబర్‌పేట్‌లో యువకుడి మృతదేహం లభ్యమైన ఘటనపై పోలీసుల దర్యాప్తు దాదాపు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది.

Updated : 30 May 2023 21:00 IST

హైదరాబాద్‌: నగర శివారు పెద్ద అంబర్‌పేట్‌లో యువకుడి మృతదేహం లభ్యమైన ఘటనపై పోలీసుల దర్యాప్తు దాదాపు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. పెద్ద అంబర్‌పేట్‌ డాక్టర్స్‌ కాలనీ సమీపంలో కుళ్లిపోయిన స్థితిలో యువకుడు రాజేశ్‌ మృతదేహాన్ని స్థానికులు సోమవారం గుర్తించి పోలీసులకు సమాచారం అందించిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలితో వివాహేతర సంబంధం కారణంగా ఆమె భర్త నాగేశ్వరరావే రాజేశ్‌ను హత్య చేసినట్లు పోలీసులు తొలుత భావించినప్పటికీ తర్వాత విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి.  

హయత్‌నగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సుజాత.. రాజేశ్‌కు ఒక మిస్డ్‌ కాల్‌ ద్వారా పరిచయమయ్యారు. ఇద్దరికీ ఆరు నెలలుగా పరిచయం ఉంది. సుజాత ఫొటోలు చూసి ఆమెకు వివాహం కాలేదని భావించాడు రాజేశ్‌. ఈక్రమంలో సుజాతను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ, ఆమెకు వివాహమై పిల్లలు ఉన్నారన్న విషయం రెండు నెలల క్రితమే తెలియడంతో మోసపోయానని గుర్తించాడు. దీంతో ఆమెను దూరం పెట్టాడు. రాజేశ్‌ దూరం కావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటానని సుజాత చెప్పింది. అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆమె ఆసుపత్రిలో ఉన్న విషయం తెలియక రాజేశ్‌ వాట్సప్‌ సందేశాలు, కాల్స్‌ చేశాడు. పదే పదే రాజేశ్‌ ఫోన్‌ చేయడంతో ఆ ఫోన్‌ కుటుంబ సభ్యులు లిఫ్ట్‌ చేసినట్టు సమాచారం. రాజేశ్‌ టీ షాప్‌ దగ్గర ఉన్నానని చెప్పడంతో అక్కడి వెళ్లిన సుజాత కుటుంబ సభ్యులు.. వెంచర్‌ వద్దకు తీసుకెళ్లి వార్నింగ్‌ ఇచ్చారు. ఆ తర్వాత సుజాత పరిస్థితి విషమంగా ఉందని రాజేశ్‌కు ఫోన్‌ చేసి వార్నింగ్‌ ఇచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుజాత మృతి చెందడంతో భయపడిన రాజేశ్‌ పురుగుల మందు తాగాడు. అనంతరం బహిర్భూమి కోసం రాజేశ్‌ ప్యాంటు తీసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో రాజేశ్‌ దుస్తులు లేకుండా పడి ఉన్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని