Apsara Murder Case: ‘మనిషిని చంపడం ఎలా?’.. ఇంటర్నెట్‌లో శోధించి పథకం ప్రకారమే హత్య

హైదరాబాద్‌లోని అప్సర అనే యువతి హత్య కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. అడ్డు తొలగించుకునేందుకే సాయికృష్ణ ఆమెను హత్య చేసినట్లు రిమాండ్‌ రిపోర్టు చెబుతోంది.

Updated : 10 Jun 2023 16:15 IST

హైదరాబాద్‌: నగరంలో సంచలనం రేపిన అప్సర హత్య (Apsara Murder Case) రిమాండ్‌ రిపోర్టులో (Remand Report) కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమెను అడ్డు తొలగించుకునేందుకే సాయికృష్ణ హత్య చేసినట్లు తేలింది. గతేడాది ఏప్రిల్‌ నుంచి పూజారి సాయికృష్ణ, అప్సర మధ్య పరిచయం ఏర్పడిందని, క్రమంగా అది వివాహేతర బంధానికి దారితీసిందని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

‘‘సరూర్‌నగర్‌లోని బంగారు మైసమ్మ ఆలయం కేంద్రంగానే ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. సాయికృష్ణ తరచూ అప్సరకు వాట్సాప్‌ ద్వారా మెసేజ్‌లు చేస్తుండేవాడు. ఇద్దరూ గత నవంబరులో గుజరాత్‌లోని సోమనాథ్‌ ఆలయం, ద్వారక గుడిని సందర్శించారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య బంధం మరింత బలపడింది. అప్సర వాట్సాప్‌ ద్వారా తన ప్రేమను వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసింది. తనను పెళ్లి చేసుకోకపోతే రోడ్డుకు ఈడుస్తానని బెదిరించింది. అందుకే సాయికృష్ణ ఆమెను అడ్డుతొలగించాలనుకొని హత్య చేశాడు. ఇదే విషయాన్ని అతడు కూడా ఒప్పుకొన్నాడు.’’ అని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

హత్యకు వారం రోజుల ముందు ‘మనిషిని చంపడం ఎలా?’ అనే విషయంపై సాయికృష్ణ ఇంటర్నెట్‌లో శోధించినట్లు రిమాండ్‌ రిపోర్టు చెబుతోంది.‘‘ తనను కోయంబత్తూర్‌కు తీసుకెళ్లాలని అంతకుముందు అప్సర పలుమార్లు కోరడంతో.. దానినే ఆమెను హత్య చేసేందుకు అడ్డం పెట్టుకున్నాడు. జూన్‌ 3వ తేదీ రాత్రి 9 గంటలకు కోయంబత్తూర్‌కు టికెట్‌ బుక్‌ చేశానని అప్సరను నమ్మించిన సాయికృష్ణ..  ఆమెను కారులో ఎక్కించుకొని రాత్రి 8.15 గంటలకు సరూర్‌నగర్‌ నుంచి బయల్దేరాడు. రాత్రి 9 గంటలకు ఇద్దరూ శంషాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్‌ అంబేడ్కర్‌ విగ్రహం దగ్గరికి చేరుకున్న తర్వాత టికెట్‌ బుక్‌ చేయలేదని చెప్పి.. అక్కడి నుంచి గోశాలకి తీసుకెళ్లాడు. రాత్రి భోజనం కోసం రాళ్లగూడ వద్ద ఓ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ దగ్గర కారు ఆపారు. అప్పటికే ఒకసారి ఆరోగ్యం బాగోలేక అప్సర వాంతి చేసుకుంది. అర్ధరాత్రి 12 గంటలకు ఇద్దరూ సుల్తాన్‌పల్లిలోని గోశాలకు చేరుకున్నారు. ఆమె నిద్రిస్తున్న సమయంలో సాయికృష్ణ హత్య చేశాడు’’ అని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని