Accident: ప్రైవేటు బస్సు బోల్తా.. 63మందికి గాయాలు

తిరుపతికి వస్తున్న ఓ ప్రైవేటు బస్సు కారును ఢీకొట్టి బోల్తా పడిన ఘటన అన్నమయ్య జిల్లాలో గురువారం మధ్యాహ్నం జరిగింది. ఈ ప్రమాదంలో 63 మంది గాయపడ్డారు.

Updated : 25 May 2023 15:00 IST

మదనపల్లె (నేరవార్తలు): అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి తిరుపతికి వస్తున్న ఓ ప్రైవేటు బస్సు కూకుటిమానగడ్డ సమీపంలో కారును వెనక నుంచి ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 56 మందికి స్వల్ప గాయాలు కాగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 వాహనంలో మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఏడుగురిని మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. 

విషయం తెలుసుకున్న మదనపల్లె ఆర్డీవో మురళీ, డీఎస్పీ శేషప్ప, పోలీసు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆసుపత్రికి వద్దకు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. అతివేగంగా రావడం, బ్రేక్‌ వేసినా బస్సు అదుపు కాకపోవడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని