కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు.. 45కి చేరిన మృతులు 

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు

Published : 17 Feb 2021 01:12 IST

మధ్యప్రదేశ్‌లో పెను విషాదం

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ బస్సు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో మృతుల సంఖ్య 45కి పెరిగింది. వీరిలో 24 మంది పురుషులు, 20మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మంగళవారం ఉదయం 8.30గంటల సమయంలో సిధి జిల్లాలోని పట్నా గ్రామంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తొలుత 18మంది మృతదేహాలను వెలికి తీసిన సహాయక సిబ్బంది.. ఆ తర్వాత నీటిలో మునిగిపోయిన వారికోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. అనంతరం మిగతా మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. ఘటన సమయంలో బస్సులో దాదాపు 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. దీనిపై రేవా డివిజినల్ కమిషనర్‌ రాజేశ్‌ జైన్‌ మాట్లాడుతూ.. సహాయక చర్యల్లో ఏడుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చామని చెప్పారు. గల్లంతైన వారికోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగించామన్నారు. సిధి జిల్లా కేంద్రం నుంచి 80 కి.మీల దూరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వాహనంపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ విషాదం జరిగినట్టు తెలుస్తోంది. 

కాగా.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మధ్యప్రదేశ్‌లో పర్యటించాల్సి ఉంది. ఈ ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఆయన పర్యటనను రద్దు చేసింది.

మృతులకు రూ.5లక్షలు పరిహారం: సీఎం
ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు తెలిపారు. ఇద్దరు మంత్రులు ఘటనా స్థలం వద్దకు వెళ్తున్నారని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబ సభ్యులకు తన సానుభూతి ప్రకటిస్తూ వీడియో సందేశాన్ని ట్వీట్‌ చేశారు.

ప్రధాని, ఉపరాష్ట్రపతి తీవ్ర విచారం 

ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సహాయక చర్యల్లో స్థానిక అధికారులు క్రియాశీలంగా నిర్వహిస్తున్నట్టు ట్వీట్‌ చేశారు. ఈ ఘటనలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనలో మృతులకు ప్రధాని నరేంద్ర మోదీ రూ.2లక్షలు, తీవ్ర గాయాలపాలైన వారికి రూ.50వేలు చొప్పున పరిహారం ప్రకటించారు.

శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు అమిత్‌ షా ఫోన్‌
ఈ ఘటన తనను బాధించిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ఫోన్‌ చేసినట్టు తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని