Secunderabad Violence: నరసరావుపేట నుంచి హైదరాబాద్‌కు ఆవుల సుబ్బారావు తరలింపు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ (Agnipath) విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ (Secundrabad railway station)లో జరిగిన అల్లర్లపై దర్యాప్తు కొనసాగుతోంది. సికింద్రాబాద్‌ అల్లర్లను ప్రోత్సహించారనే అభియోగాలపై ఈ నెల 18న ప్రకాశం జిల్లా కంభంకు చెందిన ఆవుల....

Updated : 21 Jun 2022 22:10 IST

నరసరావుపేట: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ (Agnipath) విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ (Secundrabad railway station)లో జరిగిన అల్లర్లపై దర్యాప్తు కొనసాగుతోంది. సికింద్రాబాద్‌ అల్లర్లను ప్రోత్సహించారనే అభియోగాలపై ఈ నెల 18న ప్రకాశం జిల్లా కంభంకు చెందిన ఆవుల సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకొని నరసరావుపేటకు తరలించి నాలుగు రోజులుగా విచారిస్తున్నారు. తాజాగా సుబ్బారావును అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. సుబ్బారావు నిర్వహిస్తోన్న సాయి డిఫెన్స్‌ అకాడమీకి చెందిన అభ్యర్థులు సికింద్రాబాద్‌ అల్లర్లలో పాల్గొన్నట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి అతన్ని పోలీసులు విచారించనున్నారు.

సికింద్రాబాద్‌ అల్లర్లకు సంబంధించి పలువురు అభ్యర్థులతో సుబ్బారావు దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో నరసరావుపేటలో అతను నిర్వహిస్తోన్న అకాడమీలో అధికారులు తనిఖీలు చేశారు. కేంద్ర ఇంటెలిజెన్స్, ఐటీ అధికారులు సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలోని దస్త్రాలు పరిశీలించిన అధికారులు.. సిబ్బంది నుంచి పలు వివరాలు సేకరించారు. నరసరావుపేటలో దాదాపు పదేళ్లుగా డిఫెన్స్‌ అకాడమీని నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇన్నేళ్లుగా ఇక్కడి నుంచి ఎంత మంది ఆర్మీకి ఎంపికయ్యారు? అభ్యర్థుల నుంచి ఎంత ఫీజు వసూలు చేసేవారు? పన్నులు కడుతున్నారా?లేదా వంటి ఇతరత్రా లావాదేవీలు, శిక్షణకు సంబంధించిన వివరాలపై అధికారులు ఆరా తీశారు. తాజాగా హైదరాబాద్‌ తరలిస్తుండడంతో ఈ అల్లర్లకు సంబంధించి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని