Crime News: యువతిపై చిన్నాన్న, పెదనాన్న కుమారుడి లైంగిక వేధింపులు

రెండేళ్ల వయసులోనే తల్లిదండ్రులు అనారోగ్యంతో చనిపోయారు. ఆమెను పెదనాన్న, పెద్దమ్మ పెంచి పెద్ద చేశారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే వావివరుసలు మరిచారు. సొంత చిన్నాన్న, పెదనాన్న కొడుకు ఆమెపై ...

Updated : 17 Aug 2021 07:05 IST

పురుగుల మందు తాగి బాధితురాలి బలవన్మరణం

నేరేడుచర్ల, న్యూస్‌టుడే: రెండేళ్ల వయసులోనే తల్లిదండ్రులు అనారోగ్యంతో చనిపోయారు. ఆమెను పెదనాన్న, పెద్దమ్మ పెంచి పెద్ద చేశారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే వావివరుసలు మరిచారు. సొంత చిన్నాన్న, పెదనాన్న కొడుకు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో బాధితురాలు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ఫత్తేపురంలో సోమవారం వెలుగుచూసింది.

నేరేడుచర్ల ఎస్సై విజయ్‌ప్రకాశ్‌, మృతురాలి సోదరి తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలం ఫత్తేపురానికి చెందిన ఓ యువతి(21)కి రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు మరణించారు. వారికి ఇద్దరు కూతుళ్లు కాగా.. ఒకరిని పెదనాన్న, పెద్దమ్మలు పెంచి పెద్ద చేశారు. మరొకరిని నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులు దత్తత తీసుకున్నారు. వారు ఆమెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. పెద్దమ్మ, పెదనాన్నల వద్ద ఉన్న యువతిని పదో తరగతి వరకు చదివించారు. ఆ తరువాత ఇంటి పనులు, కూలి పనులు చేయిస్తూ వేధిస్తున్నారు. సొంత చిన్నాన్న ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె గర్భం దాల్చటంతో గర్భస్రావం చేయించాడు. ఆ తర్వాత పెదనాన్న కుమారుడు లైంగికంగా వేధించడం ప్రారంభించారు. దీన్ని తాళలేక ఆమె శనివారం పురుగుల మందు తాగింది. ఆమెను తొలుత మిర్యాలగూడకు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. తన సోదరిని లైంగికంగా వేధించడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మృతురాలి సోదరి పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని