AP News: రాఖీ కట్టిన చెల్లెలు.. రెండు గంటల్లోనే శవమైంది!

ప్రేమతో అన్నయ్యకు రాఖీ కట్టింది.. తర్వాత రెండు గంటల్లోనే ఆ చెల్లెలు శవమై కనిపించింది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం విజయవాడ అరండల్‌పేటలో చోటుచేసుకుంది.

Updated : 23 Aug 2021 15:12 IST

విజయవాడలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అనుమానాస్పద మృతి

విజయవాడ, న్యూస్‌టుడే: ప్రేమతో అన్నయ్యకు రాఖీ కట్టింది.. తర్వాత రెండు గంటల్లోనే ఆ చెల్లెలు శవమై కనిపించింది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం విజయవాడ అరండల్‌పేటలో చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ యువతి అత్తింట్లో అనుమానాస్పద స్థితిలో మరణించింది. రాఖీ కట్టించుకుని ఇంటికి వెళ్లిన సోదరుడికి.. తన చెల్లి చనిపోయిందన్న విషయం తెలిసి నిశ్చేష్టులయ్యారు. తిరిగి వచ్చేసరికి మార్చురీ బాక్సులో పెట్టిన మృతదేహాన్ని చూసి భోరుమన్నారు. అత్తింటివారే ఆమె మరణానికి కారకులని బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రసాదంపాడుకు చెందిన ఉష (23) రెండేళ్ల క్రితం అరండల్‌పేటకు చెందిన ఫణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భర్త మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తుండగా, ఉష సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. భర్త కంటే ఎక్కువ సంపాదిస్తున్నావంటూ తన సోదరిని అత్తింటివారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసే వారని ఉష సోదరుడు సూర్యనారాయణ ఆరోపిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో చెల్లెలి ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకుని వెళ్లానని, తర్వాత రెండు గంటల్లోనే ఉష చనిపోయిందని సమాచారం ఇచ్చారంటూ విలపించారు. ఇంట్లో కళ్లు తిరిగి పడిపోయిన ఉషను ఆసుపత్రికి తీసుకువెళ్లామని, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారని భర్త, ఇతర బంధువులు చెబుతున్నారు. యువతి తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు సూర్యారావుపేట పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దక్షిణ ఏసీపీ ఎన్‌.వెంకటేశ్వర్లు, సీఐ సూర్యనారాయణ ఘటనాస్థలాన్ని పరిశీలించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని