Crime News: ప్రియుడి కోసం కన్నతండ్రినే చంపేసింది! 

ప్రియుడి కోసం కన్నతండ్రిని కుమార్తె హత్య చేసిన ఘటన నగరంలోని కాప్రాలో చోటుచేసుకుంది. 

Updated : 13 Nov 2021 15:11 IST

హైదరాబాద్‌: ప్రియుడి కోసం కన్నతండ్రిని కుమార్తె హత్య చేసిన ఘటన నగరంలోని కాప్రాలో చోటుచేసుకుంది. జులైలో ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆలస్యంగా ఇందులోని నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జులై 20న కాప్రాలో రామకృష్ణ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గొంతు నులిమి చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. కుటుంబ సభ్యులపై అనుమానం రావడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ఈ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
రామకృష్ణ కూతురు నారాయణగూడకు చెందిన భూపాల్‌ను ప్రేమించింది. అయితే వీరి ప్రేమ వ్యవహారం ఇష్టంలేని తండ్రి అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేయడంతో కొన్ని రోజులు జైలులో గడిపాడు. అనంతరం రామకృష్ణపై అతడు పగ పెంచుకున్నాడు. రామకృష్ణను చంపేందుకు అతడి కుమార్తెతో కలిసి పథకం పన్నాడు. అతడిని హత్య చేస్తే రూ.2 లక్షలు ఇచ్చేలా మిత్రులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పథకంలో భాగంగా రామకృష్ణ కుమార్తె జులై 19న తండ్రికి ఆహారంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అనంతరం అతడు నిద్రమత్తులో ఉండగా భూపాల్‌ మిత్రులు అతడిని గొంతు నులిమి కణతిపై పొడిచి పారిపోయారు. అనంతరం జులై 20 రామకృష్ణ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని