
Crime News: అమెజాన్లో గంజాయి రవాణా కేసు.. ఐదుగురి అరెస్టు
విశాఖ: అమెజాన్లో గంజాయి రవాణా కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్ఈబీ జేడీ సతీష్ తెలిపారు. ఈ మార్గంలో 600 నుంచి 700 కిలోల గంజాయి రవాణా అయినట్లు తెలుస్తోందన్నారు. ఈ కేసు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లు ఆయన వివరించారు. చిలకపాటి శ్రీనివాసరావు, జీరు కుమారస్వామి, బిజ్జం కృష్ణమరాజు, చీపురుపల్లి వెంకటేశ్వరరావు, చిలకపాటి మోహన్రాజు అలియాస్ రాఖిలను అరెస్టు చేసినట్లు ఆయన విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
నిందితుల వద్ద నుంచి 48 కిలోల గంజాయి, బైక్, ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి ప్యాకింగ్ మెటీరియల్, అమెజాన్ టేపులు స్వాధీనం చేసుకున్నట్లు సతీష్ చెప్పారు. ఈ కేసుకు సంబంధించి మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో సూరజ్, ముకుల్ జైస్వాల్లు అరెస్టు అయినట్లు తెలిపారు.
ప్రముఖ ఈ- కామర్స్ కంపెనీ అమెజాన్ ద్వారా విశాఖ నుంచి మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు కరివేపాకు పొడి, హెర్బల్ పౌడర్ల రూపంలో గంజాయి తరలిస్తున్నట్లు అక్కడి పోలీసులు ఇటీవల గుర్తించారు. విచారణ నిమిత్తం మధ్యప్రదేశ్ పోలీసులు విశాఖకు వచ్చి పలువురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Advertisement