Double bed room: పత్రాల్లో డబుల్‌ బెడ్ రూమ్‌ ఇళ్లు.. రూ.లక్షల్లో వసూళ్లు

పేదల సొంతింటి కలను వారు ఆయుధంగా మలచుకున్నారు. ప్రభుత్వం ఉచితంగా మంజూరు చేసే రెండు పడక గదుల ఇళ్లు ఇప్పిస్తామంటూ హైదరాబాద్‌లో పలువురు అమాయకుల నుంచి రూ.లక్షల్లో దండుకున్నారు.

Published : 04 Sep 2021 01:23 IST

హైదరాబాద్‌: పేదల సొంతింటి కలను వారు ఆయుధంగా మలచుకున్నారు. ప్రభుత్వం ఉచితంగా మంజూరు చేసే రెండు పడక గదుల ఇళ్లు ఇప్పిస్తామంటూ హైదరాబాద్‌లో పలువురు అమాయకుల నుంచి రూ.లక్షల్లో దండుకున్నారు. చివరికి బాధితుల ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను బాలానగర్‌ జోన్‌ డీసీపీ పద్మజ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. బొమ్మిడాం కుమార్‌, షేక్‌ సల్మాన్‌లు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇప్పిస్తామని బోరబండ, కూకట్‌పల్లి, మియాపూర్‌ ప్రాంతాల్లో  పలువురి వద్ద భారీగా డబ్బులు వసూలు చేశారు. ఇళ్లు కేటాయించినట్టు నకిలీ పత్రాలు సృష్టించి ఒక్కో బాధితుడి నుంచి రూ. 1.50 లక్షల నుంచి రూ. 6.50 లక్షల వరకు వసూలు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రధాన నిందితుడు కుమార్‌.. పేరు మార్చుకుని నకిలీ ఐడీ కార్డుతో హౌసింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో అధికారినని నమ్మించాడు. వీరి బారినపడి ఇప్పటివరకు 100 మంది వరకు మోసపోయి ఉంటారని బాలానగర్‌ డీసీపీ తెలిపారు.

నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.37లక్షల నగదు, 30 తులాల బంగారం, స్కోడా కారు, రూ.లక్ష విలువ చేసే బజాజ్‌ పల్సర్‌ బైక్‌, 5 నకిలీ ఫ్లాట్‌ పత్రాలు, 3 మొబైల్‌ ఫోన్లు, రెండు ల్యాప్‌ట్యాప్‌లు, 2 స్టాంపులు, ఒక కలర్‌ ప్రింటర్‌, 2 టోకెన్‌ బుక్స్‌, 18 నకిలీ పాస్‌బుక్‌లు, నకిలీ ఆధార్‌కార్డులు, పాన్‌ కార్డులు, డిప్యూటీ ఏఈ నకిలీ ఐడీ కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌వోటీ శంషాబాద్‌, సైబరాబాద్‌ పోలీసులు సంయుక్తగా ఈ కేసును ఛేదించారని, ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని డీసీపీ తెలిపారు. బొమ్మిడాం కుమార్‌, షేక్‌ సల్మాన్‌లు గతంలో 13 కేసుల్లో నిందితులుగా ఉన్నారని డీసీపీ వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని