Visakhapatnam: పెళ్లింట విషాదం.. కుమార్తె వివాహ సమయంలో తల్లిదండ్రులు బలవన్మరణం

మరికాసేపట్లో కన్న కూతురి వివాహం.. ఎంతో సంతోషంగా కన్యాదానం చేయాల్సిన సమయం.. అనూహ్యంగా పెళ్లి జరగడానికి ముందే వధువు తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు..

Updated : 27 Aug 2021 01:49 IST

మద్దిలపాలెం: మరికాసేపట్లో కన్న కూతురి వివాహం.. ఎంతో సంతోషంగా కన్యాదానం చేయాల్సిన సమయం.. పెళ్లి జరగడానికి ముందే అనూహ్యంగా వధువు తల్లిదండ్రులు ఈ లోకం వీడారు. విశాఖ జిల్లా మద్దిలపాలెంలో పెళ్లింట జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెళ్లి జరుగుతున్న సమయంలో వధువు తల్లిదండ్రులు ఎవరికీ చెప్పకుండా ఫంక్షన్‌హాల్‌ నుంచి వారి ఇంటికి వెళ్లిపోయారు. కన్యాదానం సమయంలో పెళ్లి కుమార్తె తల్లిదండ్రుల కోసం బంధువులు వెతగ్గా.. వారు కనిపించలేదు. దంపతులు కనిపించకపోవడంతో ఇంటికెళ్లి చూడగా గదిలో విగతజీవులై కనిపించారు. సమాచారం అందుకున్న ఎంవీపీ కాలనీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతులు విశాఖపోర్టు విశ్రాంత ఉద్యోగి జగన్నాథరావు (63), విజయలక్ష్మి (57) దంపతులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.

పెళ్లి కుమార్తె తల్లి విజయలక్ష్మి గత కొంతకాలంలగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఈ కారణంగా విజయలక్ష్మి తరచూ ఇరుగు పొరుగు వారితో గొడవ పడేదని.. పెళ్లి రోజు కూడా భర్తతో గొడవ పడిందని బంధువులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. భార్య ప్రవర్తనతో విసుగు చెందిన జగన్నాథరావు.. ఆమెను చంపి, తానుకూడా ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని