కాపలాపెడితే.. రూ.కోట్ల విలువైన భూమి కాజేసేందుకు యత్నం

భూ మాఫియా రెచ్చిపోతున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. తాజాగా.. బాలానగర్‌లో రూ.కోట్ల విలువ చేసే 1200 గజాల స్థలానికి

Updated : 31 Jul 2021 04:39 IST

హైదరాబాద్‌: భూ మాఫియా రెచ్చిపోతున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. తాజాగా.. బాలానగర్‌లో రూ.కోట్ల విలువ చేసే 1200 గజాల స్థలానికి కాపలాదారుగా ఉంటూ ఆ భూమిపై నకిలీ పత్రాలు సృష్టించి యజమానినే బెదిరిస్తున్న వారిని బాలానగర్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఉపేంద్రనాథ్‌ అనే వ్యక్తి తన స్థలాన్ని కబ్జాదారుల నుంచి రక్షించుకునేందుకు పదేళ్ల క్రితం గడ్డం లక్ష్మి అనే మహిళను కాపలాదారుగా నియమించుకున్నారు. దాంతో లక్ష్మి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి అక్కడే నివాసముంటోంది. 2019లో యజమాని ఉపేంద్రనాథ్‌ భూమిని డెవలప్‌మెంట్‌కు ఇవ్వడంతో బిల్డర్‌ పనులు ప్రారంభించేందుకు యత్నించగా.. కాపలాదారు లక్ష్మి, ఆమె కుమార్తె సంధ్య వారిని అడ్డుకున్నారు. భూమి తమదే అంటూ నకిలీ పత్రాలు సృష్టించి పోలీసులను తప్పుదోవ పట్టించారు. రూ.20లక్షలు లేదా 100 గజాల స్థలం ఇవ్వాలని యజమానిని బెదిరింపులకు గరిచేశారు. యజమాని ఉపేంద్రనాథ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అందుకు ప్రతిగా.. పోలీసులు, కబ్జాదారులు తమను వేధిస్తున్నారంటూ కాపలాదారు లక్ష్మి, సంధ్య మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కబ్జాదారులు తమపై దాడి చేశారంటూ మరోసారి లక్ష్మి, సంధ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల కేసులను పరిశీలించిన అనంతరం మోసాలకు పాల్పడుతున్న కాపలాదారుగా ఉంటున్న మహిళలు లక్ష్మి, సంధ్య, సరిత, వారికి సహకరించిన ఆర్మీ ఉద్యోగి దిలీప్‌కుమార్‌ను బాలానగర్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడు శ్రీనివాస్‌ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని