Crime News: జగన్‌ కేసుల కోసం ప్రత్యేక న్యాయవాది: సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల కోసం ప్రత్యేక న్యాయవాదిని నియమించే ప్రతిపాదన ఉందని సీబీఐ కోర్టుకు సీబీఐ తెలిపింది. ప్రత్యేక న్యాయవాది ప్రతిపాదన దిల్లీలోని

Published : 12 Nov 2021 01:59 IST

హైదరాబాద్‌: ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల కోసం ప్రత్యేక న్యాయవాదిని నియమించే ప్రతిపాదన ఉందని సీబీఐ కోర్టుకు సీబీఐ తెలిపింది. ప్రత్యేక న్యాయవాది ప్రతిపాదన దిల్లీలోని ప్రధాన కార్యాలయంలో ఉందని సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. రాంకీ ఫార్మా కేసులో వాదనలు వినిపించేందుకు గడువు కావాలని సీబీఐ న్యాయవాది కోరారు. ఇందూ టెక్ జోన్ దర్యాప్తు స్థితి తెలపాలని.. ఆ తర్వాతే తన డిశ్చార్జ్ పిటిషన్‌పై వాదనలు వినిపిస్తానన్న జగన్ మెమోపై సీబీఐ స్పందించింది. ఇందూ టెక్ జోన్‌లో దర్యాప్తు పూర్తయిందని.. మరో ఛార్జషీట్‌ వేసే ఆలోచన లేదని సీబీఐ స్పష్టం చేసింది. సీబీఐ మెమోను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు అభియోగాల నమోదుపై వాదనలకు సిద్ధం కావాలని నిందితుల తరఫు న్యాయవాదులను న్యాయస్థానం ఆదేశించింది. వాన్‌పిక్‌ కేసులో దర్యాప్తు స్థితి తెలపాలని ఇవాళ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి మెమో దాఖలు చేశారు. అవసరమైతే అదనపు పత్రాలు, అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని సీబీఐ పేర్కొన్నందున దర్యాప్తు స్థితి తెలపాలని కోరారు. వాన్‌పిక్‌ కేసులో దర్యాప్తు స్థితి ఈనెల 15న తెలపాలని సీబీఐని ఆదేశించింది. జగన్, విజయసాయిరెడ్డి డిశ్చార్జ్ పిటిషన్లపై కౌంటర్ల దాఖలుకు సీబీఐ మరోసారి గడువు కోరింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తదితరుల డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది.

మరోవైపు హైకోర్టులో జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించిన పిటిషన్లపై రోజువారీ విచారణ కొనసాగింది. వాన్‌పిక్‌ కేసులో క్వాష్ పిటిషన్‌పై విశ్రాంత ఐఆర్‌ఎస్‌ కేవీ బ్రహ్మానందరెడ్డి వాదనలు ముగిశాయి. వాన్‌పిక్ ప్రాజెక్ట్స్, నిమ్మగడ్డ ప్రసాద్ క్వాష్ పిటిషన్‌పై వాదనలు ప్రారంభమయ్యాయి. వాన్‌పిక్‌ వ్యవహారంలో సీబీఐ అనేక అంశాలను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టి ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించలేదని పేర్కొంది. మంత్రి మండలిని తప్పుదోవ పట్టించి ప్రాజెక్టు పొందినట్లయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎందుకు రద్దు చేయలేదని.. తప్పుదోవ పట్టించిన అధికారిని ఎందుకు సస్పెండ్ చేయలేదని వాన్‌పిక్‌ న్యాయవాది వాదించారు. తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం ఈనెల 15కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని