Crime News: నాపై 28 మంది అత్యాచారం చేశారు.. అందుకు మా నాన్నే కారణం..!

కొన్ని సంవత్సరాల పాటు దాదాపు 28 మంది వ్యక్తులు తనపై అత్యాచారం చేసారంటూ ఓ 17 ఏళ్ల బాలిక చెప్పిన తీరు తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఈ దారుణాలకు మూలకారకుడు కావడం ప్రతిఒక్కరినీ నివ్వెరపరుస్తోంది.

Published : 13 Oct 2021 12:32 IST

పోలీసులకు ఫిర్యాదు చేసిన 17 ఏళ్ల బాలిక

లఖ్‌నవూ: కొన్ని సంవత్సరాల పాటు దాదాపు 28 మంది వ్యక్తులు తనపై అత్యాచారం చేశారంటూ ఓ 17 ఏళ్ల బాలిక కన్నీటి పర్యంతమైంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఈ దారుణాలకు మూలకారకుడు కావడం ప్రతిఒక్కరినీ నివ్వెరపరుస్తోంది. తన తండ్రి, బీఎస్పీ, ఎస్పీ పార్టీలకు చెందిన నేతలు, సమీప బంధువులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు ఆరోపించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌ జిల్లాలో ఈ కేసు నమోదైందని ఓ మీడియా సంస్థ పేర్కొంది. ఆ బాలిక వెల్లడించిన వివరాల ప్రకారం...

‘మా నాన్న ట్రక్‌ డ్రైవర్‌గా పనిచేసేవాడు. నేను ఆరో తరగతి చదువుతున్న సమయంలోనే.. నాకు అసభ్యకరమైన చిత్రాలు చూపించి, లైంగికంగా లొంగదీసుకొనేందుకు ప్రయత్నించాడు. నేను దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాను. ఆ తర్వాత నమ్మించి ఒకరోజు నాకు కొత్త బట్టలు కొనిచ్చి, బైక్‌పై బయటకు తీసుకెళ్లాడు. ఓ నిర్జన ప్రదేశంలో నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే.. మా అమ్మను చంపేస్తానని బెదిరించాడు. ఇది ఇక్కడితో ఆగలేదు. ఆ ఘటన తర్వాత మా నాన్న ఒకరోజు మత్తుమందు కలిపిన అన్నం తినిపించాడు. తర్వాత నన్ను ఒక హోటల్‌కి తీసుకెళ్లాడు. అక్కడ నాపై ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నాకు స్పృహ వచ్చేసరికి నా ఒంటిపై దుస్తులు లేవు. తీవ్రంగా కడుపునొప్పి వచ్చింది. ప్రతిసారి నాకు ఇదే పరిస్థితి ఎదురయ్యేది. ఎవరో కొత్త వ్యక్తి వచ్చేవాడు. ఏ మాత్రం జాలి లేకుండా లైంగిక దాడికి పాల్పడేవాడు. ఇలా ఎన్నోసార్లు జరిగింది. ఒకసారి తిలక్ యాదవ్ వచ్చాడు. నేను వ్యతిరేకించడంతో నీ తండ్రే పంపాడంటూ అత్యాచారానికి పాల్పడ్డాడు. తిలక్‌తోపాటు ఆయన స్నేహితులు, బంధువులు, మా బంధువులు నన్ను ఇలాగే తీవ్రంగా హింసించారు’ అంటూ తన దయనీయ పరిస్థితిని పోలీసులకు వెల్లడించింది. 

కాగా, బాధితురాలి ఫిర్యాదుపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) జిల్లా అధ్యక్షుడు తిలక్ యాదవ్‌ సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రకటన విడుదల చేశారు. తనని, తన సోదరులను ఈ కేసులో ఇరికిస్తున్నారని పేర్కొన్నారు. అత్యాచార ఆరోపణల్ని కొట్టిపారేశారు. ఏది ఏమైనప్పటికీ.. ఆ బాధితురాలు ఎదుర్కొన్న దారుణ పరిస్థితి ప్రతిఒక్కరి హృదయాలను మెలిపెడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు