HYD: గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటన.. పోలీసుల అదుపులో నలుగురు

గాంధీ ఆస్పత్రిలో జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి చిలకలగూడ పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Updated : 17 Aug 2021 14:37 IST

హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రిలో జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి చిలకలగూడ పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఉమామహేశ్వర్‌తో పాటు మరో ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందిని విచారిస్తున్నారు. దీంతో పాటు బాధిత మహిళ కనిపించిన స్థలంలో క్లూస్‌ బృందం ఆధారాలు సేకరించింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి సోదరి కనిపించకపోవడంతో ఆమె కోసం పోలీసు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైరపర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి స్పందిస్తూ.. బాధితురాళ్లకు ప్రభుత్వం అండగా ఉంటుదన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో చర్చించిన ఆమె అనంతరం మీడియాతో మాట్లాడారు.

‘‘బాధితురాలు చెబితే తప్ప అసలేం జరిగిందో వివరించలేం. బాధితురాలితో ఇవాళే మాట్లాడతా. పూర్తి విచారణ జరిగిన తర్వాతే వాస్తవాలు వెల్లడవుతాయి. మరో బాధితురాలు ఎక్కడ ఉందో గుర్తించలేదు. దోషులపై కఠిన చర్యలు ఉంటాయి. చికిత్స కోసం వచ్చిన రోగి సమాచారం ఇవ్వకుండానే వెళ్లిపోయారు’’ అని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. గాంధీ ఆస్పత్రిలో తనతో పాటు తన సోదరిపై అత్యాచారం జరిగిందని బాధితురాలు నిన్న పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

అత్యాచారం జరిగిందని తేలితే కఠిన చర్యలు: సూపరింటెండెంట్‌

గాంధీ ఆస్పత్రిలో జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి విచారణకు ఆదేశించినట్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డా. రాజారావు వెల్లడించారు. అత్యాచార ఆరోపణలపై కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యాచారం జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో 189 సీసీ కెమెరాలు ఉన్నాయన్నారు. ఆరోపణలు రుజువుకాకుండా అసత్య ప్రకారం చేయొద్దని కోరారు.

చిలకలగూడ పీఎస్‌ వద్ద ఉద్రిక్తత..

మరోవైపు ఘటనకు సంబంధించిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న సమాచారంతో భాజపా మహిళా మోర్చా నేతలు చిలకలగూడ పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. పీఎస్‌ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా భాజపా మహిళా మోర్చా నేత గీత మూర్తి మాట్లాడారు. ఆస్పత్రిలో అత్యాచారానికి పాల్పడటం సిగ్గుచేటన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సెక్యూరిటీ లోపం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని మండిపడ్డారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని