Cyber Crime: అరగంటలో రూ.1.25 కోట్లు హాంఫట్‌!

ఇటీవల కొత్తగా ప్రారంభమైన ‘పేమెంట్‌ గేట్‌వే’ కంపెనీ ఖాతా నుంచి ఓ సైబర్‌ నేరస్థుడు అరగంట వ్యవధిలో రూ.1.25 కోట్లను కొల్లగొట్టిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఈ మోసంపై బంజారాహిల్స్‌లోని బాధిత కంపెనీ సీఈవో శుక్రవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు

Published : 13 Nov 2021 07:09 IST

‘పేమెంట్‌ గేట్‌వే’ సభ్యుడి ఘరానా మోసం
పోలీసులకు ఫిర్యాదు చేసిన యాజమాన్యం

నారాయణగూడ, న్యూస్‌టుడే: ఇటీవల కొత్తగా ప్రారంభమైన ‘పేమెంట్‌ గేట్‌వే’ కంపెనీ ఖాతా నుంచి ఓ సైబర్‌ నేరస్థుడు అరగంట వ్యవధిలో రూ.1.25 కోట్లను కొల్లగొట్టిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఈ మోసంపై బంజారాహిల్స్‌లోని బాధిత కంపెనీ సీఈవో శుక్రవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌రావు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ‘పేమెంట్‌ గేట్‌వే’ కంపెనీని ఇటీవల ప్రారంభించారు. సంస్థ నిర్వహణ కోసం ‘పూల్డ్‌ అకౌంట్‌’లో కొన్ని రూ.కోట్లు ఉంచారు. ఇటీవల ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి ‘పేమెంట్‌ గేట్‌వే కంపెనీ’లో మార్చంటైల్‌గా సభ్యత్వం తీసుకున్నాడు. దీంతో అతడికి డబ్బులు జమ చేయడంతో పాటు ఇతరులకు బదిలీ చేసేందుకూ వెసులుబాటు కలిగింది. సదరు వ్యక్తికి రూ.20 లక్షలలోపు మాత్రమే డబ్బులు తీసుకునే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌ సాంకేతికతపై పూర్తి అవగాహన ఉండటంతో ‘పేమెంట్‌ గేట్‌వే’ ఖాతాను అతడు హ్యాక్‌ చేసేశాడు. దీంతో కొంతసేపు ఆ కంపెనీ లావాదేవీలకు అంతరాయం కలిగింది. ఈ వ్యవధిలో తనకున్న రూ.20 లక్షల పరిమితి దాటి అదనంగా రూ.2 లక్షలు డ్రా చేసి చూశాడు. అతడి ప్రయత్నం ఫలించింది. ఆ తర్వాత అరగంట వ్యవధిలోనే మరో ఏడు ఖాతాలకు మొత్తం రూ.1.25 కోట్లు బదిలీ చేసుకున్నాడు. ఈ డబ్బులు బదిలీ అయినట్లు సంస్థ యాజమాన్యానికి హెచ్చరిక సందేశం(అలర్ట్‌ మెసేజ్‌) రావడంతో.. అప్రమత్తమైన వారు మరింత డబ్బు పోకుండా పూల్డ్‌ ఖాతాను స్తంభింప చేశారు. ఒడిశాకు చెందిన వ్యక్తే ఇదంతా చేసినట్లుగా గుర్తించారు. ఈ కేసుపై సమగ్ర విచారణ జరుపుతున్నామని సైబర్‌ పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని