
Karvy Stock Broking case: రెండో రోజు పార్థసారథిని ప్రశ్నించిన సీసీఎస్ పోలీసులు
హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ ఛైర్మన్ పార్థసారథిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు రెండో రోజు ప్రశ్నించారు. ఇండస్ ఇండ్ బ్యాంకులో తనఖా పెట్టిన షేర్లకు సంబంధించిన పూర్తి వివరాలను సీసీఎస్ పోలీసులు పార్థసారథి నుంచి సేకరించినట్లు సమచారం. పెట్టుబడిదారులకు చెందిన డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లను బ్యాంకులో తనఖా పెట్టి రూ.137 కోట్లను పార్థసారథి రుణంగా తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 26, 27 తేదీల్లో పార్థసారథిని ప్రశ్నించినప్పటికీ పోలీసులు సరైన సమాధానాలు రాబట్టలేకపోయారు. దీంతో పోలీసులు నాంపల్లి న్యాయస్థానం అనుమతితో మరోసారి రెండు రోజుల కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
రెండు రోజుల కస్టడీలో భాగంగా నిన్న పార్థసారథి నుంచి కార్వీ సంస్థ లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని సీసీఎస్ పోలీసులు రాబట్టారు. ఆడిట్ రిపోర్టులోని అంశాలను పార్థసారథి వద్ద ప్రస్తావించారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్తో పాటు అనుబంధ సంస్థలకు చెందిన ఆరు బ్యాంకు ఖాతాలను సీసీఎస్ పోలీసులు స్తంభింపజేశారు. వాటికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. సీసీఎస్ పోలీస్ స్టేషన్లోనే పార్థసారథిపై మరో రెండు కేసులు నమోదయ్యాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు వద్ద రూ.437 కోట్లు రుణంగా తీసుకొని తిరిగి చెల్లించలేదని అభియోగాలున్నాయి.