Crime news: లైన్‌మెన్‌ బంగార్రాజు హత్యకేసులో కోరాడ గోవింద్‌ అరెస్టు

విశాఖలో కలకలం రేపిన విద్యుత్‌శాఖ లైన్‌మెన్‌ బంగార్రాజు హత్యకేసులో ప్రధాన నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 08 Nov 2021 19:08 IST

విశాఖపట్నం: విశాఖలో కలకలం రేపిన విద్యుత్‌శాఖ లైన్‌మెన్‌ బంగార్రాజు హత్యకేసులో ప్రధాన నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. పద్మనాభం మండలం ఏనుగులపాలెంలో వారం రోజుల క్రితం బంగార్రాజు హత్యకు గురైన విషయం తెలిసిందే. కేసు నమోదు చేయడం, నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులు జాప్యం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబుతో పాటు, బాధితులు ఆరోపించారు. దీనిపై ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ కూడా రాశారు. దీంతో స్పందించిన పోలీసులు హత్యకేసు దర్యాప్తును వేగవంతం చేశారు.

డీసీపీ గౌతమి సాలి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించి హత్యకేసు వివరాలను వెల్లడించారు. బంగార్రాజు హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని వెల్లడించారు. ‘‘తనకు రాజకీయ నాయకులు తెలుసని, విద్యుత్‌ శాఖలో షిఫ్ట్‌ ఆపరేటర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానని కోరాడ గోవింద్‌ చెప్పడంతో అతన్ని నమ్మిన బంగార్రాజు నిరుద్యోగుల నుంచి రూ.3లక్షలు, రూ.3.50లక్షలు చొప్పున వసూలు చేశాడు. నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన రూ.30లక్షలు గోవింద్‌కు ఇచ్చాడు.  కానీ రోజులు గడుస్తున్నా గోవింద్‌ ఉద్యోగాలు ఇప్పించలేదు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వివాదమేర్పడింది. ఈనేపథ్యంలో అక్టోబరు  31న బంగార్రాజు హత్యకు గురయ్యాడు. కోరాడ లక్ష్మణరావు గెస్ట్‌హౌస్‌ పక్కన బంగార్రాజు మృతదేహం ఉందని సమాచారం వచ్చింది. బంగార్రాజు భార్య నందిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. బంగార్రాజు హత్యలో ఎలాంటి రాజకీయ కోణం లేదు. ఈకేసులో ప్రధాన నిందితుడు కోరాడ గోవింద్‌ను అరెస్టు చేశాం. ఈ హత్యలో కోరాడ లక్ష్మణరావు, పైడి రాజు, వెంకటేశ్‌ హస్తం ఉందని ఫిర్యాదు అందింది. వారి పాత్ర ఎంతవరకు ఉందనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. గోవింద్‌ తీసుకున్న రూ.30లక్షలు ఎవరి వద్ద ఉన్నాయనే దానిపై కూడా ఆరా తీస్తున్నాం. సేకరించిన సాంకేతిక ఆధారాలను కోర్టుకు సమర్పిస్తాం’’ అని డీసీపీ తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని