Ts News: కుటుంబం ఆత్మహత్య కేసులో.. వనమా రాఘవేంద్రరావు అరెస్టు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు

Updated : 07 Dec 2022 19:00 IST

హైదరాబాద్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావును హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు.ఆత్మహత్యకు ముందు రామకృష్ణ తీసుకున్న సెల్ఫీ వీడియో చర్చనీయాంశమైన నేపథ్యంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పందిస్తూ కొత్తగూడెం నియోజకవర్గం ప్రజలకు లేఖ రాశారు. పాల్వంచ ఘటన తీవ్ర క్షోభకు గురిచేసిందన్నారు. తన కుమారుడిపై రామకృష్ణ ఆరోపించిన నేపథ్యంలో పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని వెల్లడించారు. రాఘవను పోలీస్‌ విచారణకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు లేఖలో తెలిపారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే స్పందించిన గంటల వ్యవధిలోనే హైదరాబాద్‌లో రాఘవను పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. హైదరాబాద్‌లో అరెస్టు చేసిన రాఘవను పోలీసులు కొత్తగూడెం తరలించినట్లు తెలుస్తోంది. రాఘవపై పాల్వంచ పీఎస్‌లో 302, 306, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

రాఘవపై కొనసాగుతున్న కేసుల పరంపర..

ప్రజాప్రతినిధి కుమారుడిగా నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు, తెరాస నేత వనమా రాఘవేంద్రరావును ఆది నుంచీ వివాదాలు వెంటాడుతున్నాయి. పాల్వంచ గ్రామీణం, పట్టణ పోలీస్ స్టేషన్లలో ఇప్పటివరకు మొత్తం 6 కేసులు నమోదయ్యాయి. పాల్వంచ గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు సెక్షన్ల కింద 2 కేసులు నమోదయ్యాయి. 2013లో ప్రభుత్వ ఉద్యోగి ఉత్తర్వులు ఉల్లంఘించి, ఎన్నికల సమయంలో డబ్బులు పంచారని కేసు వేశారు. అదే ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి, వారి విధులకు ఆటంకం కలిగించి దౌర్జన్యం చేశారంటూ మరో కేసు నమోదైంది. పాల్వంచ పట్టణం పోలీస్‌స్టేషన్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. 2006లో ఓ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి అల్లరి మూకలతో కలిసి హంగామా చేశారన్న ఆరోపణలపైనా కేసు నమోదైంది. 2017లో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని.. 2020లో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని.. 2021లో ఆత్మహత్యకు పురిగొల్పారంటూ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా పలువురి ఆత్మహత్యలకు సంబంధించి రాఘవేంద్రరావు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

గిరిజన మహిళపై హత్యాయత్నం కేసులో ఆరోపణలు..

గిరిజన మహిళ జ్యోతికి చెందిన స్థలం వివాదంలో రాఘవేంద్రరావు అనుచరులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. గిరిజన మహిళపై హత్యాయత్నం కేసులో రాఘవేంద్రరావు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కేసు ఎస్సీ, ఎస్టీ కమిషన్ వరకూ వెళ్లడం సంచలనం రేపింది. పాల్వంచకు చెందిన ఫైనాన్స్ వ్యాపారి వెంకటేశ్వర్లు ఆత్మహత్య కేసులో ఎ-1గా ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాదాపు 20 రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లి హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ దాఖలు చేసి కేసు నుంచి బయటపడ్డారు. తాజాగా నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులోనూ ఏ-2గా రాఘవేంద్రరావుపై పోలీసు కేసు నమోదైంది. ఇలా అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా వనమా రాఘవేంద్రరావు నిలుస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగూడెం నియోజకవర్గంలో పేరుకే తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నారని.. అంతా కుమారుడిదే రాజ్యం అన్న విమర్శలకు కొదవలేదు. నియోజకవర్గాన్ని తన కనుసన్నల్లో నడిపిస్తారన్న ఆరోపణలు ఆది నుంచీ ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలో వ్యక్తిగత పంచాయతీల నుంచి భూ వివాదాలు, సెటిల్మెంట్లలో రాఘవ జోక్యం చేసుకోవడంతో వివాదాస్పదమైన సంఘటనలు అనేకం గతంలోనూ వెలుగులోకి వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని