Crime News: తల్లీకుమార్తెల దారుణ హత్య.. గొంతు కోసి చంపేసిన దుండగులు

ప్రకాశం జిల్లా టంగుటూరులో తల్లీకుమార్తె దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. టంగుటూరులో నివాసం ఉంటున్న

Updated : 04 Dec 2021 08:03 IST

 

సింగరాయకొండ, ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లా టంగుటూరులో తల్లీకుమార్తె దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. టంగుటూరులో నివాసం ఉంటున్న బంగారం వ్యాపారి జలదంకి రవికిషోర్‌ భార్య శ్రీదేవి(43), కుమార్తె వెంకట లేఖన(21)లను గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా గొంతు కోసి చంపేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపింది. రవికిషోర్‌ సింగరాయకొండ రోడ్డులో ఆర్‌.కె.జ్యుయెలర్స్‌ పేరిట బంగారు దుకాణం నిర్వహిస్తున్నారు. ఆయన రాత్రి 8.20 గంటల సమయంలో ఇంటికి వెళ్లి చూసేసరికి భార్య, కుమార్తె గొంతుకోసిన స్థితిలో, తీవ్ర రక్తస్రావమై అచేతనంగా పడిఉన్నారు. వెంటనే విషయాన్ని చుట్టుపక్కల వారికి తెలియజేశారు. వారి ద్వారా సమాచారం అందుకున్న ఎస్‌.ఐ. నాయబ్‌ రసూల్‌, సింగరాయకొండ సీఐ ఎం.లక్ష్మణ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. లేఖన ప్రస్తుతం బీటెక్‌ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఈ హత్యలు చేయాల్సిన అవసరం ఎవరికి ఉందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు నేతృత్వంలో క్లూస్‌టీమ్‌ ఆధారాలు సేకరిస్తోంది. రవికిషోర్‌ సోదరుడు రంగాకు చెందిన బంగారు ఆభరణాల దుకాణంలో మూడు నెలల క్రితం సుమారు 800 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఆ కేసు ఇప్పటికీ కొలిక్కిరాలేదు. ఇంతలోనే అదే కుటుంబానికి చెందిన రవికిషోర్‌ భార్య, కుమార్తె హత్యకు గురికావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని