
Crime news : సంతానం కోసం భార్యాభర్తల అమానుషం.. యువతిని 16 నెలలు బంధించి..!
ఉజ్జయిని: మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. సంతానం కోసమని ఓ యువతిని బంధించిన ఓ వ్యక్తి ఆమెపై 16 నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇందుకు అతడి భార్య సహకరించడం గమనార్హం. చివరకు శిశువు జన్మించాక బాధితురాలిని ఈనెల 6న ఓ బస్టాప్ వద్ద పడేసి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఉజ్జయినిలోని కథ్ బరోడా గ్రామానికి చెందిన రాజ్పాల్ సింగ్ (38), చంద్రకాంత (26) దంపతులు. రాజ్పాల్ గతంలో ఉపసర్పంచిగా పనిచేశాడు. అయితే వారికి పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా మృతిచెందారు. దీంతో సంతానం పొందాలని భావించిన ఆ జంట.. 16 నెలల క్రితం మహారాష్ట్రలోని నాగ్పుర్లో ఓ మహిళ వద్ద నుంచి ఓ యువతి(21)ని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి బాధితురాలిని వారి ఇంట్లోనే బందీగా ఉంచి రాజ్పాల్ సింగ్ అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో గర్భం దాల్చిన యువతి.. గత నెల 25న శిశువుకు జన్మనిచ్చింది.
బస్స్టాప్ వద్ద పడేసి పరారు
కాగా ఈనెల 6న ఆపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని దేవాస్ బస్స్టాప్ వద్ద పడేసి రాజ్పాల్ పరారయ్యాడు. స్పృహలోకి వచ్చిన యువతి పోలీసులను ఆశ్రయించి తనపై జరిగిన అమానుషాన్ని వారికి వివరించింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె ఇచ్చిన వివరాల ప్రకారం రాజ్పాల్ దంపతులు సహా వారి ముగ్గురు బంధువులపైనా కేసు నమోదు చేశారు. మానవ అక్రమ రవాణాకు కూడా పాల్పడినట్లు కేసులో పేర్కొన్న పోలీసులు.. బాధితురాలిని విక్రయించిన వారి వివరాలు సేకరించేందుకు యత్నిస్తున్నారు. ప్రధాన నిందితుడు రాజ్పాల్ను అరెస్ట్ చేశారు. మిగతా వారిని త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు.