Suicide: అత్తింటికి వెళ్లాలన్న బెంగతో నవ వధువు ఆత్మహత్య

కాళ్ల పారాణిపై కన్నీటి చుక్క రాలింది. మామిడి తోరణం వాడిపోయింది. బాజాభజంత్రీలు మోగిన ఇల్లు మూగబోయింది. సంతోషాల విడిది విషాదంతో నిండింది. తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యాయి. తోబుట్టువుల ఆనందం మాయమైంది. చిరునవ్వులు చెదిరిపోయాయి. నవ

Updated : 01 Dec 2021 10:10 IST


సుజన (పాతచిత్రం)

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: కాళ్ల పారాణిపై కన్నీటి చుక్క రాలింది. మామిడి తోరణం వాడిపోయింది. బాజాభజంత్రీలు మోగిన ఇల్లు మూగబోయింది. సంతోషాల విడిది విషాదంతో నిండింది. తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యాయి. తోబుట్టువుల ఆనందం మాయమైంది. చిరునవ్వులు చెదిరిపోయాయి. నవ వధువు తనువుచాలించింది. పుట్టింటిపై బెంగతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. పుట్టింటిని వదిలి అత్తింటికి వెళ్లాలన్న బెంగతో నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అనంతపురంలోని బళ్లారి రోడ్డులో జరిగింది.

నగరానికి చెందిన హెడ్‌కానిస్టేబుల్‌ సూర్యనారాయణకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో సుజన(26) మొదటి సంతానం. బీటెక్‌ పూర్తి చేసి, 2019లో గ్రామ సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం సాధించింది. బుక్కరాయసముద్రంలోని గ్రామ సచివాలయం-2లో పనిచేస్తోంది. గత నెల 17న చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామానికి చెందిన నరసింహులు కుమారుడు విశ్వనాథ్‌తో వివాహమైంది. పది రోజుల పాటు సెలవు పెట్టి పుటింట్లో ఉంది. తిరిగి సోమవారం విధులకు హాజరైంది. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చిన సుజన రాత్రి ఇంట్లోని స్నానాల గదిలో ఉరేసుకుని ఆత్మహత్మకు పాల్పడింది. వారం రోజులుగా అత్త వారింటికి ప్రయాణం వాయిదా వేస్తూ వచ్చింది. తల్లిదండ్రులు సర్దిచెప్పి వెళ్లాలని సూచించారు. వారిని వదిలి వెళ్లాల్సి వస్తుందన్న బెంగతో సోమవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించారు. అప్పటికే మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు అనంత గ్రామీణం సీఐ మురళీధర్‌రెడ్డి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని