
TS News: గాంధీ ఆసుపత్రిలో సామూహిక అత్యాచారం
అక్కాచెల్లెళ్లపై అమానుషం
రేడియోగ్రాఫర్, మరికొందరి ఘాతుకం
ఈనాడు-హైదరాబాద్, న్యూస్టుడే-గాంధీ ఆసుపత్రి: రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. గాంధీ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన ఓ రోగికి సహాయకులుగా ఉండేందుకు వచ్చిన అక్కాచెల్లెళ్లను అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న రేడియోగ్రాఫర్, అతడి స్నేహితులు గదిలో నిర్బంధించి, మత్తుమందిచ్చి వారంరోజులు సామూహిక అత్యాచారం చేశారు. తన తల్లి, పిన్ని కనిపించడం లేదంటూ బాధితురాలి కుమారుడు ఓ రేడియోగ్రాఫర్ను నిలదీయగా.. ఎక్కడున్నారో చూద్దామంటూ ఆదివారం సాయంత్రం ఆసుపత్రి అంతా కలియతిప్పాడు. ఓ చోట శరీరంపై అరకొర దుస్తులతో అపస్మారక స్థితిలో ఉన్న పిన్ని కనిపించింది. సపర్యలు చేసి ఆమెను మహబూబ్నగర్కు తీసుకువెళ్లారు. జరిగిన దారుణాన్ని అక్కడ ఆమె వివరించింది. దాంతో సోమవారం స్థానిక పోలీసులకు తెలిపారు. హైదరాబాద్లోనే ఫిర్యాదు చేయాలని చెప్పడంతో చిలకలగూడ ఠాణాలో ఫిర్యాదు చేశారు. చిలకలగూడ ఇన్స్పెక్టర్ కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మూత్రపిండాల వ్యాధితో ఈ నెల 5న గాంధీ ఆసుపత్రిలో చేరారు. భార్య, మరదలు ఆయనకు సహాయకులుగా వచ్చారు. కుమారుడు రోజూ ఆసుపత్రికి వచ్చి వెళ్లేవాడు. ఆసుపత్రిలోని రేడియోగ్రాఫర్ ఉమామహేశ్వర్ ఆ మహిళలకు దూరపు బంధువు కావడంతో వారు అతడితో మాట్లాడేవారు. ఈ నెల 8 నుంచి అక్కాచెల్లెళ్లిద్దరూ కనిపించలేదు. రోగి కుమారుడు (17) వెళ్లి ఉమామహేశ్వర్ను అడగ్గా విషయం వెలుగులోకి వచ్చింది,.
గదిలో నిర్బంధం...
ఉమామహేశ్వర్ ఈనెల 8న ఆ మహిళలను ఒక గదికి తీసుకెళ్లి కల్లులో మత్తుమందు కలిపి తాగించాడని తెలుస్తోంది. వారు ఆపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత ఉమామహేశ్వర్తో పాటు మరికొందరు వారిపై సామూహికంగా అత్యాచారం చేశారు. ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించారు. మర్నాడు వారిద్దరినీ సెల్లార్లోని చీకటి గదిలోకి తీసుకెళ్లి మరోమారు అఘాయిత్యానికి పాల్పడ్డారు.. అనంతరం నగరంలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న అనంతరం పోలీసులు ఉమామహేశ్వర్తో పాటు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
మరో బాధితురాలు ఎక్కడ?
అత్యాచార బాధితుల్లో మరో బాధితురాలి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడు ఉమామహేశ్వర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. మరి కొందరిని కూడా ప్రశ్నించారు. ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు విచారణకు ఆదేశించారు.