Road Accident: గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు జూనియర్‌ ఆర్టిస్టుల మృతి

నగరంలోని గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. హెచ్‌సీయూ రోడ్‌లో వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి

Updated : 18 Dec 2021 13:58 IST

బ్యాంకు ఉద్యోగి కూడా.. మరొకరికి గాయాలు

హైదరాబాద్‌: నగరంలోని గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. హెచ్‌సీయూ రోడ్‌లో వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి రహదారి పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మృతిచెందిన వారిలో ఇద్దరు జూనియర్‌ ఆర్టిస్టులు, కారు  డ్రైవ్‌ చేస్తున్న ఓ బ్యాంకు ఉద్యోగి మృతి చెందారు. మరో జూనియర్‌ ఆర్టిస్ట్ సిద్ధుకు గాయాలయ్యాయి. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మృతులను అబ్దుల్‌ రహీమ్‌, ఎన్‌.మానస(23), ఎం.మానస(21)గా గుర్తించారు. వీరు అమీర్‌పేట్‌లోని హాస్టల్లో ఉంటున్నారు. అబ్దుల్‌.. మాదాపూర్‌లోని యాక్సిన్‌ బ్యాంకులో పని చేస్తున్నారు. ఇతడిని విజయవాడ వాసిగా.. ఎం.మానస స్వస్థలం మహబూబ్‌నగర్‌ జిల్లా బాదేపల్లిగా గుర్తించారు. నిన్న రాత్రి గచ్చిబౌలిలోని సిద్ధూ ఇంటికి ఎం.మానస, అబ్దుల్‌, ఎన్‌. మానస వెళ్లారు. మద్యం మత్తు, అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. అతివేగంతో వెళ్లి చెట్టును ఢీకొనడంతో కారు రెండు ముక్కలైందని చెప్పారు.

ప్రమాదానికి గురైన ఈ నలుగురికి ఎలా పరిచయం ఉందన్న వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. అర్ధరాత్రి లింగంపల్లి ఎందుకు వెళ్తున్నారన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని