Road Accident: ఏడడుగుల బంధం.. ఏడాదిలోనే విషాదం
కలిసి ఏడడుగులు నడిచి ఏడాదైనా కాలేదు. కొద్దిరోజుల్లో తొలి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొనేందుకు సిద్ధమైన ఆ జంటను మృత్యువు వేరుచేసింది. మన్యంలో ప్రకృతి అందాలను తిలకించేందుకు ద్విచక్రవాహనంపై బయల్దేరి ...
రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్తకు తీవ్రగాయాలు
పాడేరు, న్యూస్టుడే: కలిసి ఏడడుగులు నడిచి ఏడాదైనా కాలేదు. కొద్దిరోజుల్లో తొలి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొనేందుకు సిద్ధమైన ఆ జంటను మృత్యువు వేరుచేసింది. మన్యంలో ప్రకృతి అందాలను తిలకించేందుకు ద్విచక్రవాహనంపై బయల్దేరి విశాఖ నగరం నుంచి వచ్చిన దంపతులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా.. భర్త తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. పాడేరు ఎస్సై లక్ష్మణ్, స్థానికుల వివరాలు తెలిపిన ప్రకారం.. విశాఖ నగరంలోని సీతంపేటకు చెందిన తరుణ్, హేమలత దంపతులు పాడేరు సమీపంలోని వంజంగి మేఘాలకొండ అందాలను తిలకించేందుకు శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో స్నేహితులతో కలిసి మూడు ద్విచక్ర వాహనాలపై బయలుదేరారు. ఉదయం 6.45 గంటల ప్రాంతంలో పాడేరు పట్టణ శివారులోని వంతాడపల్లి చెక్గేట్ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న కారును తప్పించబోతున్న క్రమంలో వర్షం కారణంగా రోడ్డు తడిగా ఉండటంతో ద్విచక్రవాహనం అదుపుతప్పింది. ఈ క్రమంలో కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో వెనుక కూర్చున్న హేమలత (21) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. తరుణ్కు గాయాలవడంతో స్నేహితులు పాడేరు జిల్లా ఆసుపత్రికి అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్కు తరలించారు. భార్య మృతిచెందిన విషయం తెలియక నా హేమ ఎక్కడుంది, ఎలా ఉంది అంటూ తరుణ్ బోరున విలపించడం అక్కడివారిని కంటతడి పెట్టించింది. వీరికి గతేడాది డిసెంబరులోనే వివాహమైంది. తరుణ్ పెదవాల్తేరులో సొంతంగా ఒక ల్యాబ్ ఏర్పాటు చేసుకొని టెక్నీషియన్గా సేవలందిస్తున్నారు. కుటుంబంలో చిన్న పొరపొచ్చాలొచ్చి ఈ ఏడాది దసరా రోజుల్లో వేరే కాపురం పెట్టారు. కార్తికమాసం కావడంతో పాడేరు సమీపంలోగల వంజంగి కొండల అందాలను చూసేందుకు భార్యతో బయలుదేరి వచ్చారు. ఇంతలోనే రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉదయం 8 గంటల సమయంలో సమాచారం అందడంతో బంధువులు హుటాహుటిన పాడేరు బయలుదేరి వెళ్లారు. దంపతులిద్దరిలో ఎవరూ పాడేరు వెళ్తున్న విషయం తమకు చెప్పనేలేదని కుటుంబ సభ్యులు వాపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.