Crime News: సుపారి ఇచ్చి.. భర్తను హత్య చేయించి

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలో ఈ నెల 10న కప్పలకుంటతండాలో హత్యాకేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్టు కోదాడ డీఎస్పీ రఘు తెలిపారు. స్థానిక ఠాణాలో మంగళవారం రాత్రి ఏర్పాటు

Published : 13 Oct 2021 09:25 IST

ఆరుగురి నిందితుల అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న కోదాడ డీఎస్పీ రఘు, పక్కన సీఐ శివరాంరెడ్డి

మేళ్లచెరువు, న్యూస్‌టుడే: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలో ఈ నెల 10న కప్పలకుంటతండాలో హత్యాకేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్టు కోదాడ డీఎస్పీ రఘు తెలిపారు. స్థానిక ఠాణాలో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ శివరాంరెడ్డితో కలిసి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కప్పలతండాకు చెందిన భూక్యా బాలాజీ (40) ఈ నెల 10న హత్యకు గురయ్యారు. అతడిది సహజ మరణమని నమ్మించేందుకు భార్య బుజ్జి విఫలయత్నం చేయగా.. హత్యేనని మృతుడి సోదరుడు నెహ్రూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు చేయగా రూ.90 వేలు సుపారితో హత్యకు కుట్ర పన్నినట్టు తేలింది.

తాపీ పని చేసే బాలాజీ దుబాయ్‌ నుంచి నాలుగు నెలల క్రితం ఇంటికొచ్చారు. అతడి భార్య బుజ్జి తండాకు చెందిన బాణోతు పరుశురాముడు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు రెండు నెలల క్రితం బాలాజీకి అనుమానం వచ్చింది. దీంతో వారిరువురు నిత్యం గొడవపడుతుండేవారు. ఎలాగైనా తమ వివాహేతర సంబంధానికి అడ్డంకిగా మారిన బాలాజీని అడ్డు తొలగించుకునేందుకు వీరిరువురు కుట్ర పన్నారు. ఓ సిమెంటు పరిశ్రమలో పనిచేస్తున్నప్పుడు స్నేహితుడిగా ఉన్న నునావత్‌ పవన్‌కుమార్‌ నాయక్‌కు అసలు విషయంపరుశురాముడు చెప్పాడు. ఇతడిది ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం చిట్యాల తండా. హత్య చేసేందుకు అంగీకరించిన పవన్‌.. గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం కేతవరంతండాకు చెందిన బానావత్‌ సామెల్‌ నాయక్‌, బాణావత్‌ రాజానాయక్‌లతో పాటు చిట్యాల తండాకు చెందిన నునావత్‌ కోట్యానాయక్‌లను కలుపుకొని హత్యకు రూ.90 వేలు సుపారి మాట్లాడుకున్నారు. ప్రణాళిక ప్రకారం హత్యచేయడానికి ఈ నెల ఏడో తేదీ రాత్రి మద్యం తాగి బాలాజీ ఇంటివద్దకు వచ్చిన వీరు ధైర్యం చాలక వెనుదిరిగి వెళ్లిపోయారు. మళ్లీ 10న రాత్రి వచ్చి.. బాలాజీ ఇంటి ముందు ఆరుబయట పడుకుని ఉండటాన్ని గమనించారు. అక్కడే వీరికోసం ఎదురుచూస్తున్న బాలాజీ భార్య బుజ్జి, పరుశురాముడుతో కలిసి మంచంపై పడుకున్న బాలాజీ ముక్కు, నోరు ఒకరు, ఇంకొంకరు గొంతు, కాళ్లు, చేతులు ఒకరొకరు బిగుతుగా ఊపిరాడకుండా, కదలకుండా పట్టుకుని ఉండగా.. మరొకరు తలపై గట్టిగా మోదారు. దీంతో బాలాజీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మళ్లీ అతనిది సహజ మరణమే అని నమ్మించేందుకు ఇంట్లో పడుకోబెట్టి పరారయ్యారు. ఈ హత్య చేసేందుకు చేతులకు గ్లౌజులు వాడారు. ఈ కేసు దర్యాప్తులో సాంకేతిక పరమైన ఆధారాలు పోలీసులకు చిక్కాయి. దీంతో రెండ్రోజుల వ్యవధిలోనే నిందితులు దొరికిపోయారు. ఈ ఆరుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్‌కు పంపినట్టు డీఎస్పీ తెలిపారు. వారి వద్ద ఐదు చరవాణిలు, రెండు ద్విచక్ర వాహనాలు, రూ.30 వేలు నగదు, నాలుగు చేతి గ్లౌజులు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. కేసును చేధించిన సీఐ శివరాంరెడ్డి, మేళ్లచెరువు ఎస్సై రవీందర్‌, పీఎస్సై రంజిత్‌కుమార్‌లతో పాటు సిబ్బంది వెంకటేశ్వర్లు, రామారావు, వీరబాబు, ఆంజినేయులను ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ అభినందించినట్టు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు