Telugu academy: బ్యాంకులు, అకాడమీ సిబ్బంది పరస్పర ఆరోపణలు.. కొనసాగుతోన్న దర్యాప్తు

తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్ మాల్ కేసులో సీసీఎస్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. తెలుగు అకాడమీ అధికారులతో పాటు యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, అగ్రసేన్ బ్యాంకు అధికారులనూ సీసీఎస్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తెలుగు అకాడమీ అధికారులు బ్యాంకులపై... బ్యాంకు అధికారులు తెలుగు అకాడమీ సిబ్బందిపై పరస్పర ఆరోపణలు చేస్తుండటంతో....

Updated : 21 Dec 2022 16:27 IST

హైదరాబాద్: తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్ మాల్ కేసులో సీసీఎస్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. తెలుగు అకాడమీ అధికారులతో పాటు యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, అగ్రసేన్ బ్యాంకు అధికారులనూ సీసీఎస్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తెలుగు అకాడమీ అధికారులు బ్యాంకులపై... బ్యాంకు అధికారులు తెలుగు అకాడమీ సిబ్బందిపై పరస్పర ఆరోపణలు చేస్తుండటంతో ఒకేసారి వీళ్లందరినీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తెలుగు అకాడమీ డైరెక్టర్, అకౌంట్స్ అధికారి సంతకాలు ఫోర్జరీ చేసినట్లు సీసీఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే డిపాజిట్ పత్రాలు, లేఖలను సీసీఎస్ పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఫోర్జరీ చేసినట్లు తేలితే.. ఎవరు ఈ మోసానికి పాల్పడ్డారు అనే విషయాన్ని పోలీసులు తేల్చాల్సి ఉంటుంది.

రూ.63 కోట్ల డిపాజిట్లను అగ్రసేన్ బ్యాంకులోని ఏపీ మర్కంటైల్ సొసైటీ ఖాతాకు మళ్లించి అక్కడి నుంచి విడతల వారీగా నగదు విత్ డ్రా చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ రెండో వారం వరకు కూడా నగదును తీసుకున్నారు. ఏపీ మర్కంటైల్ సొసైటీ క్లర్క్‌ మొహిద్దీన్ నగదును నిందితులకు అందజేశారు. నగదు తీసుకున్నది ఎవరనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. యూనియన్ బ్యాంకు చీఫ్ మేనేజర్ మస్తాన్ వలీకి సహాయకుడిగా వ్యవహరించిన రాజ్ కుమార్... ఈ తతంగంలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాజ్ కుమార్‌తో పాటు మరో ముగ్గురు ఏజెంట్లు కలిసి నకిలీ డిపాజిట్ పత్రాలు, లేఖలు సృష్టించి మోసానికి తెరలేపినట్లు భావిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే మస్తాన్ వలీతో పాటు ఏపీ మర్కంటైల్ సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణ, మేనేజర్ పద్మావతి, క్లర్క్ మొహిద్దీన్‌లను అరెస్ట్ చేశారు. నలుగురు నిందితులను పదిరోజుల కస్టడీకి ఇవ్వాలని ఇప్పటికే నాంపల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కస్టడీకి అనుమతిస్తే... నలుగురు నిందితులను ప్రశ్నించడం ద్వారా మరికొంత సమచారం వచ్చే అవకాశం ఉందని సీసీఎస్ పోలీసులు భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని