Crime News: ఆ ముగ్గురిది 4 ఏళ్ల స్నేహం.. 4 క్షణాల్లో మరణం

ముగ్గురు యువకులు.. ఒకే చోట ఉద్యోగం. నాలుగేళ్ల స్నేహం. ఒకరి ఇళ్లకు మరొకరు వెళ్లేంత అనుబంధం. ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లడం..రావడం ఆనవాయితీ. అలా కలిసే ఓ శుభకార్యానికి వెళ్లిన ముగ్గురూ కలిసే ప్రాణాలు కోల్పోయారు. కన్నవాళ్లకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చి..

Updated : 29 Aug 2021 07:14 IST

వేబ్రిడ్జ్‌ నుంచి రివర్స్‌లో వస్తూ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ
బైక్‌తో సహా ఎగిరిపడిన యువకులు
పెళ్లికి హాజరై తిరిగి వెళ్తుండగా ఘటన..అక్కడికక్కడే మృతి

చౌటుప్పల్‌ గ్రామీణం, రామంతాపూర్‌, న్యూస్‌టుడే: ముగ్గురు యువకులు.. ఒకే చోట ఉద్యోగం. నాలుగేళ్ల స్నేహం. ఒకరి ఇళ్లకు మరొకరు వెళ్లేంత అనుబంధం. ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లడం..రావడం ఆనవాయితీ. అలా కలిసే ఓ శుభకార్యానికి వెళ్లిన ముగ్గురూ కలిసే ప్రాణాలు కోల్పోయారు. కన్నవాళ్లకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చి..స్నేహానికి ఇక సెలవంటూ తిరిగిరాని లోకాలకు తరలివెళ్లారు. ఈ హృదయవిదారక ఘటన హైదరాబాద్‌-విజయవాడ జాతీయరహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలో శనివారం తెల్లవారుజామున జరిగింది. చౌటుప్పల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.శ్రీనివాస్‌, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లికి చెందిన మేడి హరీష్‌(22), సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ వాసి  మహ్మద్‌ సల్మాన్‌(23), హైదరాబాద్‌ పాతబస్తీ వాసి మహ్మద్‌ ఆసిఫ్‌(22) హైదరాబాద్‌ రామంతాపూర్‌లోని గ్లోబల్‌ టెక్నో సర్వీసెస్‌లో ఏసీ మెకానిక్‌లుగా పనిచేస్తున్నారు. నాలుగేళ్లుగా సంస్థ ఇచ్చిన వసతి గృహాలలో ఉంటూ మంచి స్నేహితులయ్యారు. పండగలు సహా ఇతర సందర్భాల్లో ఒకరి ఇళ్లకు మరొకరు వెళ్లేంత అనుబంధం వారి మధ్య ఉండేదని, ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారని కుటుంబ సభ్యులు తెలిపారు.  ఇదే తరహాలో హరీష్‌ తన స్వగ్రామంలోని స్నేహితుడి సోదరుని వివాహనికి శుక్రవారం సల్మాన్‌, ఆసిఫ్‌లతో కలిసి వెళ్లాడు. శుభకార్యం ముగిసిన తర్వాత అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఒకే ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. చౌటుప్పల్‌ మండలం ధర్మోజీగూడెం దాటి వేబ్రిడ్జిని సమీపిస్తుండగా, వేబ్రిడ్జ్‌ లోపలి ఉంచి రివర్స్‌లో జాతీయ రహదారిపైకి దూసుకొచ్చిన లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి ద్విచక్ర వాహనంతోపాటు ముగ్గురూ ఎగిరి జాతీయ రహదారి డివైడర్‌ సమీపంలో పడ్డారు. అలికిడి విన్న పెట్రోలింగ్‌ పోలీసులు అక్కడికి వచ్చేలోపే తల, శరీర భాగాలకు తీవ్రగాయాలై ముగ్గురూ మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన లారీ(ఏపీ24టీ 5199) ఖమ్మం జిల్లా నేలకొండపల్లి నుంచి గ్రానైట్‌ లోడుతో హైదరాబాద్‌లోని అత్తాపూర్‌కి వెళ్తోందని పోలీసులు తెలిపారు. ‘గ్రానైట్‌ తూకం కోసం లారీ డ్రైవర్‌ వేబ్రిడ్జిలోకి వెళ్లాడు. రాత్రివేళ సిబ్బంది స్పందించకపోవడంతో రివర్స్‌ గేర్‌ వేసుకుని వేగంగా జాతీయ రహదారిపైకి రావడంతో ప్రమాదం జరిగిందని’ వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయిన ముగ్గురూ అవివాహితులే. వారిలో ఆసిఫ్‌కు నెల రోజుల కిందట పెళ్లి కుదిరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని