
CP anjani kumar: బెడిసికొట్టిన పథకం ... రూ.కోటి విలువైన ఆభరణాలు స్వాధీనం
హైదరాబాద్: పంజాగుట్ట పీఎస్ పరిధిలో బంగారు ఆభరణాల చోరీ కేసును హైదరాబాద్ పోలీసులు వేగంగా ఛేదించారు. ముంబయికి చెందిన నగలవ్యాపారి నుంచి రెండు కిలోల బంగారు నగలు దోచేసింది ఆయన కింద పనిచేసే ఉద్యోగే అని దర్యాప్తులో నిగ్గు తేల్చారు. ఈమేరకు బషీర్బాగ్లోని హైదరాబాద్ పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీపీ అంజనీకుమార్, వెస్ట్ జోన్ జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాసరావుతో కలిసి చోరీ వివరాలను వెల్లడించారు. చోరీకి పాల్పడ్డ ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.కోటి విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ముంబయికి చెందిన నగల వ్యాపారి శ్రవణ్ కుమార్ (రనూజ జ్యువెలర్స్ యజమాని) హైదరాబాద్తో పాటు దేశంలోని పలు నగరాలకు బంగారు ఆభరణాలను సరఫరా చేస్తుంటారు. శ్రవణ్ కింద ఉద్యోగులుగా పనిచేసే ముకేష్, గులాబ్ మాలి ఇద్దరూ గత నెల 23న 3336 గ్రాముల బంగారు ఆభరణాలను హైదరాబాద్లోని పలు షాపులకు డెలివరీ ఇచ్చేందుకు ముంబైలో బస్సెక్కారు. గోల్డ్ ట్రేడింగ్ , విలాసాలకు అలవాటు పడిన గులాబ్ మాలి అనే ఉద్యోగి.. అతని స్నేహితుడు ప్రవీణ్ కుమార్తో కలిసి బంగారాన్ని పక్కదోవ పట్టించేందుకు పథకం పన్నాడు.
పథకం ప్రకారం తన స్నేహితుడు ప్రవీణ్ కుమార్ ను ముంబైలో బస్సెక్కించి, 2 కిలోలకు పైగా బంగారం ఉన్న ప్యాకెట్ ను ప్రవీణ్ కు ఇచ్చి పుణేలో దించేశాడు. హైదరాబాద్ లోని అమీర్ పేటకు చేరుకున్న తర్వాత తాను నిద్రలో ఉన్నప్పుడు బంగారం చోరీకి గురైందని యజమాని, తోటి ఉద్యోగి ముకేష్ తో నమ్మబలికాడు. ఇద్దరూ కలిసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. జీరో ఎఫ్ ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు కేసును పంజాగుట్ట పీఎస్ కు బదిలీచేశారు. పంజాగుట్ట ఏసీపీ గణేష్ బాదితులను లోతుగా విచారించగా వారిలో చోరీకి పాల్పడ్డ గులాబ్ మాలి తన తప్పును ఒప్పుకున్నాడు. తన స్నేహితుడు ప్రవీణ్ కుమార్ తో కలిసి ఈ చోరీకి పాల్పడ్డట్లు వెల్లడించాడు. చోరీకి గురైన బంగారం రాజస్థాన్ లోని ప్రవీణ్ ఇంట్లో దాచిపెట్టినట్లు సమాచారం అందించాడు. ఏసీపీ గణేష్, ఎస్ఐ నిరంజన్ రెడ్డిలతో కూడిన టీం రాజస్థాన్ లోని ప్రవీణ్ ఇంటికి వెళ్లి చోరీకి గురైన 2,052.980 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన 69.150 గ్రాముల బంగారాన్ని నిందితుడు ప్రవీణ్ ఓ బ్యాంకులో కుదువ పెట్టి ఆడబ్బును విలాసాలకు ఖర్చు చేశాడని పోలీసులు నిగ్గుతేల్చారు. పదేళ్లుగా యజమాని శ్రవణ్ కుమార్ దగ్గర నమ్మకంగా పనిచేసిన ఉద్యోగి గులాబ్ మాలీనే ఈ చోరీకి పథక రచన చేశాడని.. వ్యసనాలకు బానిసై ఈ దురాగతానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరినీ అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టారు. వేగంగా కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులను సీపీ అంజనీకుమార్ ఈ సందర్భంగా అభినందించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.