Crime News: తక్కువ ధరకే బంగారం.. విజయవాడలో భారీ మోసం

భారతీయులు.. ముఖ్యంగా దక్షిణ భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ తక్కువ ధరకే బంగారం వస్తుందంటే కాదనేవారు ఉండరు

Updated : 22 Sep 2021 18:43 IST

విజయవాడ: భారతీయులు.. ముఖ్యంగా దక్షిణ భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ తక్కువ ధరకే బంగారం వస్తుందంటే కాదనేవారు ఉండరు. ఈ ఇస్టాన్నే ఇద్దరు ఘరానా మోసగాళ్లు అవకాశంగా మలుచుకున్నారు. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని చెప్పి 57 మందిని మోసం చేశారు. బాధితుల నుంచి దాదాపు రూ.8 కోట్లు వసూలు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రైల్వే ఉద్యోగి వెంకటేశ్వరరావు, నాగమణి గత 13 ఏళ్లుగా నగరంలో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. నిందితులు ఆన్‌లైన్‌ రమ్మీలో రూ. 1.32 కోట్లు పోగొట్టుకున్నారు. పోయిన డబ్బును సంపాదించాలని నిందితులిద్దరూ పథకం వేసుకున్నారు. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని చెప్పి కొంత మంది నుంచి డబ్బులు వసూలు చేశారు. అధిక వడ్డీ ఇస్తామని చెప్పడంతో మరి కొంత మంది బంగారం కూడా ఇచ్చారు. ఇలా రైల్వేలో పనిచేసే టీటీఈలు, దుర్గ గుడి ఉద్యోగులతో కలిపి మొత్తంగా 57 మంది నుంచి దాదాపు రూ.8 కోట్లు డబ్బు వసూలు చేశారు. డబ్బులు ఇచ్చిన వాళ్లు బంగారం అడగడంతో వ్యవహారం తెరపైకి వచ్చింది. బాధితులు వేధిస్తున్నారంటూ నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడంతో జరిగిన మోసం వెలుగులోకి వచ్చింది. బాధితుల నుంచి తీసుకున్న బంగారాన్ని నిందితులు ఓ ప్రైవేటు బ్యాంకులో తాకట్టు పెట్టారు. నాగమణిని పోలీసులు అరెస్టు చేయగా.. వెంకటేశ్వరరావు రైల్వే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై మోసపోయిన బాధితులెవరూ ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు