TS News: కుమారుడి మృతి.. ఖననం చేసిన చోటే ఉరేసుకొని తండ్రి ఆత్మహత్య

కుమారుడి మృతి తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చోటు చేసుకుంది.

Updated : 19 Dec 2021 12:23 IST

సత్తుపల్లి: కుమారుడి మృతి తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చోటు చేసుకుంది. ఈ నెల 15న కుమారుడు సాయి భాను ప్రకాశ్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా.. తండ్రి ఈ ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. రాంబాబు కుటుంబం ఖమ్మంలో నివాసం ఉంటోంది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ పాఠశాలలో సాయి పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 14న స్నేహితులతో కలిసి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నాడు. ఈ వేడుకల విషయమై సాయిని పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు మందలించారు. మరోవైపు పాఠశాల యాజమాన్యం వారం రోజుల పాటు సస్పెండ్‌ చేసింది.

ఈ పరిణామాలతో మనస్తాపం చెందిన విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో అతడిని హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 16న సాయి మృతిచెందాడు. స్వగ్రామం సత్తుపల్లిలో కుమారుడి అంత్యక్రియలు పూర్తి చేసిన అనంతరం రాంబాబు నిన్న రాత్రి 11గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లాడు. ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా ఈ ఉదయం కుమారుడిని ఖననం చేసిన ప్రాంతంలోనే చెట్టుకు ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు. ఈ ఘటనతో సత్తుపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని