Crime News: వ్యాపారవేత్త హత్యకేసులో వీడిన మిస్టరీ.. ఛార్జర్‌ వైరుతో రాహుల్‌ హత్య.. సీపీ వెల్లడి

విజయవాడ వ్యాపారవేత్త రాహుల్‌ హత్య కేసు మిస్టరీ వీడింది. రాహుల్‌ను కారులో ఉన్న ఛార్జర్ వైరుతో హత్య చేశారని విజయవాడ సీపీ తెలిపారు. కారు వెనక సీట్లో కూర్చుని

Published : 28 Aug 2021 02:14 IST

విజయవాడ: విజయవాడ వ్యాపారవేత్త రాహుల్‌ హత్య కేసు మిస్టరీ వీడింది. రాహుల్‌ను కారులో ఉన్న ఛార్జర్ వైరుతో హత్య చేశారని విజయవాడ సీపీ శ్రీనివాసులు తెలిపారు. కారు వెనక సీట్లో కూర్చుని రాహుల్‌ను హత్య చేసినట్లు చెప్పారు. ఈ హత్య కేసుకు సంబంధించిన వివరాలను గురువారం సీపీ మీడియాకు వెల్లడించారు.

సీపీ మాట్లాడుతూ.. ‘‘కోరాడ విజయ్‌కుమార్‌ 1991 నుంచి చిట్‌ఫండ్స్‌ వ్యాపారం చేస్తున్నారు. చాగర్ల గాయత్రి అనే మహిళ ఇందులో భాగస్వామిగా ఉన్నారు. 2019లో ఎన్నికల బరిలో నిలిచిన కోరాడ విజయ్‌కుమార్‌ ఓటమి పాలవడంతో పాటు భారీగా నష్టపోయారు. ఈ క్రమంలో అప్పుల వాళ్లు వెంటపడటంతో అసహనానికి లోనయ్యాడు. కోరాడ విజయ్‌కుమార్‌, రాహుల్‌కు వ్యాపార సంబంధాలున్నాయి. తనకు అప్పుల బాధ ఎక్కువ అయిందని.. వారికున్న ఫ్యాక్టరీని విక్రయించి లేదా తన వాటా ఇవ్వాల్సిందిగా కోరాడ విజయ్‌కుమార్‌ రాహుల్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. డబ్బు ఇవ్వకుండా, షేర్స్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయకుండా రాహుల్‌ మాటదాటేస్తూ రావడంతో కోరాడ విజయ్‌ కుమార్‌ కోగంటి సత్యం వద్దకు వెళ్లాడు. ఈ ఫ్యాక్టరీలో కోగంటి సత్యం షేర్స్‌ కొనుగోలు చేసి తను కూడా భాగస్వామి కావాలనుకున్నాడు.

కోగంటి సత్యం, కోరాడ విజయ్‌కుమార్‌ ఒకటి రెండు సార్లు ఈ విషయంలో రాహుల్‌ను బెదిరించారు. అప్పటికీ రాహుల్‌ సెటిల్‌ చేయలేదు. ఇదే సమయంలో చాగర్ల గాయత్రి కూతురికి దిల్లీలో మెడికల్‌ పీజీ సీటు ఇప్పిస్తానని రాహుల్‌ రూ.6 కోట్లు తీసుకున్నారు. సీటు ఇప్పించకపోగా.. డబ్బు సైతం తిరిగి ఇవ్వలేదు. ఆ విషయంలోనూ రాహుల్‌పై వారు అసహనంతో ఉన్నారు. ఈ క్రమంలో ఈ నెల 18న రూ.50 లక్షలు ఇస్తానని గాయత్రికి చెప్పి రాహుల్‌  సీతారాంపురంలోని చిట్‌ఫండ్స్‌ ఆఫీస్‌కు తన కారులో వెళ్లాడు. కోరాడ విజయ్‌కుమార్‌కు సంబంధించిన కొంత మంది మనుషులు అక్కడికి చేరుకొని రాహుల్‌ను కొట్టారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం రాహుల్‌ను వేరే కారులో తీసుకెళ్లారు. కొన్ని పత్రాల మీద సంతకాలు తీసుకున్న కోగంటి సత్యం, కోరాడ విజయ్‌ కుమార్‌ అక్కడి నుంచి రాహుల్‌ను పంపించారు. విజయ్‌కుమార్‌, మరో ముగ్గురితో కలిసి రాహుల్‌ను తన కారు వద్దకు తీసుకెళ్లారు. రాహుల్‌ను కారులోని ముందు సీట్లో కూర్చోబెట్టి ఛార్జర్‌ వైర్‌తో వెనక నుంచి మెడకు బిగించి హత్య చేశారు’’ అని సీపీ వివరించారు.

ఈ కేసుకు సంబంధించి కోరాడ విజయ్‌కుమార్‌ సహా ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సీపీ వెల్లడించారు. కోగంటి సత్యాన్ని ఇప్పటికే అరెస్టు చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 13 మంది నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని