Murder: విజయవాడ యువతిని చంపేసి.. యమునా నదిలో తోసేశారు!

విజయవాడకు చెందిన యువతి అదృశ్యం కేసును కొత్తపేట పోలీసులు ఛేదించారు.

Published : 10 Aug 2021 11:41 IST

విజయవాడ (కొత్తపేట): విజయవాడకు చెందిన యువతి అదృశ్యం కేసును కొత్తపేట పోలీసులు ఛేదించారు. ప్రేమించిన వాడితో జీవితం పంచుకోవాలని ఇంటి నుంచి వెళ్లిపోయిన యువతి.. ఆ మాయగాడి మోసానికి బలైపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తస్లిమా ఫాతిమా అనే యువతి.. స్థానికంగా ఉంటున్న ఓ యువకుడిని ప్రేమించింది. కొద్దిరోజుల క్రితం ప్రియుడు తన స్వస్థలమైన ఉత్తర్‌ప్రదేశ్‌ వెళ్లిపోయాడు. ప్రియుడు రమ్మని చెప్పడంతో గత నెల పదో తేదీన ఫాతిమా విజయవాడలోని ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుమార్తె ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు స్థానిక కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అదృశ్యం కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. సదరు యువతి ఉత్తర్‌ప్రదేశ్‌లోని యమునా నదీ తీరంలో మృతిచెందినట్లు గుర్తించారు.

తొలుత నిందితులు దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలనే ప్రయత్నం చేసినప్పటికీ యూపీ పోలీసులు వివరాలు సేకరించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అప్పటికే కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో అదృశ్యం కేసు నమోదై ఉండటంతో.. సమాచారం అందుకున్న విజయవాడ పోలీసులు యూపీ వెళ్లి విచారణ చేపట్టారు. యువతి యూపీ వెళ్లాక ప్రియుడు, మరో వ్యక్తి కలిసి ఆమె వద్ద నుంచి నగదు, బంగారం కాజేసి హతమార్చి యమునా నదిలోకి తోసేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతరం నిందితులను గుర్తించి రైల్లో విజయవాడ తీసుకొచ్చారు. మంగళవారం వారిని కోర్టులో హాజరు పరచనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని