Hyderabad: హైదరాబాద్‌లో ఉగ్రకుట్ర భగ్నం.. ముగ్గురి అరెస్ట్‌

హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్రపన్నారన్న నిఘావర్గాల సమాచారంతో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి నాలుగు హ్యాండ్‌ గ్రనేడ్‌లు, రూ.5.41లక్షల నగదు, చరవాణులు, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.

Updated : 02 Oct 2022 19:14 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్రపన్నారన్న నిఘావర్గాల సమాచారంతో హైదరాబాద్‌ ముసారాంబాగ్‌లో నివాసముంటున్న అబ్దుల్‌ జాహెద్‌ను సిట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి ముసారాంబాగ్‌తో పాటు చంపాపేట్‌, సైదాబాద్‌, బాబానగర్‌, సంతోష్‌ నగర్‌లోని మరికొందరి ఇళ్లలో కూడా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సాయంతో సిట్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం జాహెద్‌తో పాటు సైదాబాద్‌ వాసి సమీరుద్దీన్‌, మెహదీపట్నం వాసి హసన్‌ ఫారూఖీని అరెస్టు చేశారు.

గతంలో బేగంపేట టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో పేలుడు సహా పలు ఘటనల్లో జాహెద్‌ పాల్గొన్నట్టు పోలీసులు వెల్లడించారు. పాకిస్థాన్‌ ఐఎస్ఐ-ఏఈటీతో తరచూ సంప్రదింపులు జరిపినట్టు గుర్తించారు. బేగంపేట్‌ బ్లాస్ట్‌ కేసులో పరారీలో ఉన్న ఫర్హతుల్లా, అబ్దుల్‌ మాజిద్‌లు పాకిస్థాన్‌లో స్థిరపడినప్పటికీ హైదరాబాద్‌లో మరోసారి ఉగ్రదాడికి పథకం రచించారు. వారికున్న కాంటాక్ట్స్‌ ద్వారా జాహెద్‌తో సంప్రదింపులు జరిపారు. ఉగ్రదాడికోసం జాహెద్‌.. మాజ్‌ హసన్‌, సమీరుద్దీన్‌ను రిక్రూట్‌ చేసుకున్నాడని ఇంటిలిజెన్స్‌ వర్గాలు ఇచ్చిన సమాచారంతో సిట్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. పాకిస్థాన్‌ ఉగ్రవాద హ్యాండర్ల నుంచి గ్రనేడ్లు తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. గుంపులుగా ఉన్న ప్రజలపైకి గ్రనేడ్లు విసిరి దాడి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పాకిస్థాన్‌ ఐఎస్ఐ తీవ్రవాదులతో మళ్లీ సంబంధాలు ఉన్నాయన్న సమాచారంతో జాహెద్‌ను అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి నాలుగు హ్యాండ్‌ గ్రనేడ్‌లు, రూ.5.41లక్షల నగదు, చరవాణులు, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. గ్రనేడ్‌లు విసిరి తద్వారా నగరంలో తీవ్ర భయాందోళనలు, మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించాలని కుట్రపన్నారని పోలీసులు వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే నలుగురు అరెస్టు..

ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నారన్న ఆరోపణలతో పీఎఫ్‌ఐపై చేపట్టిన దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తెలుగు రాష్ట్రాల్లో నలుగుర్ని అరెస్టు చేసింది. ధార్మిక కార్యకలాపాల పేరుతో మత విద్వేషాలు రెచ్చగొట్టడంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాల్లో శిక్షణ ఇస్తున్నారంటూ పీఎఫ్‌ఐపై నిజామాబాద్‌లో స్థానిక పోలీసులు తొలుత కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అనంతరం దీన్ని ఎన్‌ఐఏకు బదిలీ చేశారు. దర్యాప్తులో భాగంగా ఎన్‌ఐఏ అధికారులు గతంలోనే ఒకసారి సోదాలు నిర్వహించారు. గత ఆదివారం రెండోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో 40 ప్రాంతాల్లో సోదాలు జరిపారు. ఈ సందర్భంగా పలు పత్రాలు, హార్డ్‌డిస్కులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే బోధన్‌కు చెందిన సయ్యద్‌ సమీర్‌, ఆదిలాబాద్‌కు చెందిన ఫిరోజ్‌, జగిత్యాలకు చెందిన మహ్మద్‌ ఇర్ఫాన్‌ అహ్మద్‌, నెల్లూరుకు చెందిన ఎండీ ఉస్మాన్‌లను అరెస్టు చేసి నాంపల్లిలోని నాలుగో అదనపు మున్సిపల్‌ సెషన్స్‌ జడ్జి ఎదుట హాజరుపరిచారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని