TS 10th Exam: వాట్సప్‌లో హిందీ ప్రశ్నపత్రం.. ముగ్గురు నిందితులకు బెయిల్‌ మంజూరు

రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ముగ్గురు నిందితులకు మంగళవారం హనుమకొండ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Published : 11 Apr 2023 16:38 IST

వరంగల్‌: రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కస్టడీ, బెయిల్‌ దరఖాస్తులపై మంగళవారం హనుమకొండ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో మరింత విచారణ నిమిత్తం ప్రధాన నిందితుడు కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు బండి సంజయ్‌తో పాటు ఏ2, ఏ3 భూర ప్రశాంత్‌, గుండెబోయిన మహేశ్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఈ నెల 6న న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయగా, బండి సంజయ్‌ తమకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ ఆరెస్టయిన ఐదో తేదీన దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో బండి సంజయ్‌కి బెయిల్‌ మంజూరై విడుదల కావటంతో, ఆయన కస్టడీ పిటిషన్‌ నిష్ప్రయోజనమైంది.

దీంతో పోలీసులు ఐదో నిందితుడు ఎం.శివగణేశ్‌ను తమ కస్టడీకి ఇవ్వాలంటూ సోమవారం మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ రెండు కస్టడీ పిటిషన్లపై హనుమకొండ జిల్లా నాలుగో అదనపు మునిసిఫ్‌ మేజిస్ట్రేట్‌ న్యాయస్థాన ఇన్‌ఛార్జి న్యాయమూర్తి, రైల్వే కోర్టు మేజిస్ట్రేట్‌ షేక్‌ అరీఫ్‌ సోమవారం వాదనలు విన్నారు. అలాగే ఇదే ముగ్గురు (ప్రశాంత్‌, మహేశ్‌, శివగణేశ్‌) నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్‌ దరఖాస్తులపైనా వాదనలు విన్నారు. ఏ2 ప్రశాంత్‌, ఏ3 మహేశ్‌, ఏ5 శివగణేష్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు కస్టడీ పిటిషన్‌ను న్యాయమూర్తి డిస్మిస్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని