Crime news: ఘోరం: భార్య, నలుగురు పిల్లల్ని చంపి.. వ్యక్తి ఆత్మహత్య‌!

భార్య, నలుగురు పిల్లల్ని చంపిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న దారుణం తమిళనాడులో చోటుచేసుకుంది. ఈ ఘోరానికి కుటుంబ తగాదాలే కారణమయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

Published : 13 Dec 2022 20:45 IST

తిరువన్నామలై: తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. భార్య, ఇద్దరు టీనేజ్‌ కుమార్తెలతో పాటు మొత్తం ఐదుగురు కుటుంబ సభ్యుల్ని చంపిన ఓ వ్యక్తి ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం తిరువణ్ణామలై జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి చెంగమ్‌ తాలుకా ఒరంత్వాడీ గ్రామానికి చెందిన పళనిస్వామి (45)గా గుర్తించారు. అతడు వ్యవసాయ కూలీగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ ఘాతుకానికి గల కారణాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికీ.. కుటుంబంలో తగాదాలే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇంటికి చేరుకొని చూడగా పళనిస్వామి ఇంటిపై కప్పునకు ఉరివేసుకొని ఉండగా.. అతడి భార్య (37), ముగ్గురు కుమార్తెలు, కొడుకు విగతజీవులుగా పడి ఉన్నట్టు గుర్తించారు. మరో కుమార్తె (9) గాయాలతో పడి ఉండగా ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటనకు దారితీసిన కారణాలు తెలుసుకొనేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని