Toll Gate: గేటు తీయడం ఆలస్యమైందని.. టోల్‌ ఉద్యోగి హత్య

గేటు ఆలస్యంగా తీశాడని కొందరు ఓ టోల్‌ ఉద్యోగిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Published : 06 Jun 2023 01:16 IST

బెంగళూరు: కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. గేటు తీయడం ఆలస్యమైందంటూ ఓ టోల్‌ ఉద్యోగిపై (26) కొందరు యువకులు దాడి చేశారు. ఈ ఘటనలో టోల్‌ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. బెంగళూరు (Bengaluru)కు 35 కి.మీ దూరంలో ఉన్న రామనగర (Ramanagara)కు సమీపంలోని బిడది (Bidadi) పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ దాడి ఘటన జరిగింది.

బిడదిలో ఉన్న ఓ టోల్‌ప్లాజాలో ఆదివారం రాత్రి పవన్‌ కుమార్‌ (26)తో పాటు అతడి సహచరుడు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు కారులో మైసూరుకు ప్రయాణం చేస్తున్నారు. టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్న తర్వాత.. గేటును త్వరగా తీయాలంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అది కాస్త తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇది గమనించిన స్థానికులు వారికి సర్దిచెప్పంతో వివాదం ముగిసింది. దీంతో నలుగురు వ్యక్తులు కారును కొంతదూరం పోనిచ్చి.. అక్కడ ఆగిపోయారు. టోల్‌ప్లాజాలో పనిచేస్తున్న పవన్‌, అతడి సహచరుడు భోజనం కోసం టోల్‌గేటు బయటకు వచ్చారు. ఇది గమనించిన ఆ నలుగురు వ్యక్తులు.. వారిపై హాకీ కర్రలతో దాడి చేసి పారిపోయారు. ఈ ఘటనలో పవన్‌ కుమార్‌ ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు బెంగుళూరుకు చెందినవారిగా గుర్తించినట్టు చెప్పారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు