Hyderabad: ‘గ్యాంగ్‌’ సినిమా తరహాలో సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లో భారీ చోరీ

సూర్య నటించిన ‘గ్యాంగ్‌’ సినిమా తరహాలో సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లో ఆదివారం పట్టపగలు భారీ చోరీ జరిగింది.

Updated : 27 May 2023 18:27 IST

హైదరాబాద్‌ (రెజిమెంటల్ బజార్): సూర్య, కీర్తి సురేశ్‌, రమ్యకృష్ణ నటించిన ‘గ్యాంగ్‌’ సినిమా చూశారా?. ఆ సినిమాలో ఐటీ అధికారులమంటూ హీరో సూర్య సోదాలు చేసే సన్నివేశం ఉంటుంది. ఆ సీన్‌ను గుర్తుకు తెచ్చేలా సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లో పట్టపగలు దుండగులు చోరీకి పాల్పడ్డారు. 

శనివారం ఉదయం ఐదుగురు వ్యక్తులు రద్దీగా ఉండే మోండా మార్కెట్‌లోని బాలాజీ జ్యూవెలరీ దుకాణానికి వచ్చారు. బంగారం కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారంటూ  దుకాణం  వద్దకు వచ్చి బెదిరించారు. దుకాణంలో ఉన్న బంగారం మొత్తం తనిఖీ చేయాలని సిబ్బందిని మొత్తం పక్కన కూర్చోబెట్టారు. షాపులో ఉన్న 1700 గ్రాముల  బంగారానికి సంబంధించి ఎలాంటి ట్యాక్స్‌ చెల్లించలేదని, బంగారం స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్కడి నుంచి బంగారంతో ఉడాయించారు.

దీంతో దుకాణ యజమాని ఆ ప్రాంతంలో ఉన్న మిగతా జ్యూవెలరీ షాపుల యజమానులకు ఐటీ అధికారులు వచ్చి బంగారం స్వాధీనం చేసుకున్న విషయం చెప్పాడు. ఐటీ అధికారులు ఇలా వచ్చి తనిఖీలు చేయరు, నోటీసులు ఇస్తారని చెప్పడంతో .. అనుమానం వచ్చిన దుకాణ యజమాని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఐటీ అధికారులతో మాట్లాడి.. బంగారం స్వాధీనం చేసుకున్న వ్యక్తులు నకిలీ ఐటీ అధికారులుగా తేల్చారు. సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. ఐదుగురు వ్యక్తులు ఐటీ అధికారుల పేరుతో సోదాలు చేసినట్టు గుర్తించారు. బంగారం షాపు యజమానికి ఎలాంటి అనుమానం రాకుండా ఐటీ అధికారులు ఏ విధంగా సోదాలు చేస్తారో అదే పద్ధతిని అనుసరించారు. దుకాణంలో పనిచేస్తున్న సిబ్బంది అందరినీ ఒక పక్కన కూర్చోబెట్టి తనిఖీలు చేశారని పోలీసులు తెలిపారు. దోపిడీ తర్వాత నిందితులు సికింద్రాబాద్‌ నుంచి ఉప్పల్‌ వైపు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు.

తెలిసిన వాళ్ల పనేనని భావిస్తున్నాం: డీసీపీ

మోండా మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన బంగారం చోరీ ఘటనలో నిందితులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు ఉత్తర మండల డీసీపీ చందన దీప్తి తెలిపారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించి ఆరుగురికి ఈ ఘటనతో ప్రమేయం ఉన్నట్టు గుర్తించామన్నారు. ‘‘మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన రివెన్‌ మధుకర్‌ బవర్‌ నాలుగు నెలల క్రితమే మోండా మార్కెట్‌లో బంగారం షాపు పెట్టుకున్నారు. మధుకర్‌ సొంతూరు వెళ్లడంతో అతని బావమరిది వికాస్‌ ఖేదకర్‌  బాలాజీ గోల్డ్‌ షాప్‌లో తయారీ పని చూసుకుంటున్నాడు. వికాస్‌ ఖేదర్‌ దిల్‌సుఖ్‌నగర్‌లో మరో గోల్డ్‌ షాపు నిర్వహిస్తున్నాడు. చోరీ జరిగిన సమయంలో షాపులో మొత్తం ముగ్గురు పనివాళ్లు ఉన్నారు. ఆ సమయంలో వచ్చిన దుండగులు ఐటీ అధికారులమంటూ ఐడీ కార్డులు చూపించి కార్ఖానాలో ఉన్న  17 బంగారం బిస్కట్లు (ఒక్కోటి 100 గ్రాములు) ఎత్తుకెళ్లారు. బంగారం స్వాధీనం చేసుకున్న తర్వాత పనివాళ్లను లోపలే పెట్టి బయట గడియపెట్టారు. బంగారం డెలివరీ చేసేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఇది తెలిసిన వాళ్ల పనేనని భావిస్తున్నాం’’ అని డీసీపీ తెలిపారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు