అమానుషం: జుట్టు పట్టి లాగి.. కర్రలతో బాది!

మధ్యప్రదేశ్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మామయ్య కొడుకులతో ఫోన్లో మాట్లాడారన్న కారణంతో ఇద్దరు బాలికలను కుటుంబ సభ్యులు చితకబాదారు

Updated : 04 Jul 2021 18:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మధ్యప్రదేశ్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మామయ్య కొడుకులతో ఫోన్‌లో మాట్లాడారన్న కారణంతో ఇద్దరు బాలికలను కుటుంబ సభ్యులు చితకబాదారు. జుట్టు పట్టి లాగి, కర్రలతో దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న స్థానికులు కనీసం ఆపే ప్రయత్నం చేయకపోగా.. చోద్యం చూస్తూ వీడియోలు తీశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఏడుగురిని అరెస్ట్‌ చేశారు.

మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లాలో గిరిజన సామాజిక వర్గానికి చెందిన 19, 20 ఏళ్ల బాలికలపై గత నెల 22న ఈ దాడి జరిగింది. 25న పోలీసులకు ఆ వీడియో చేరడంతో దర్యాప్తు చేపట్టారు. ఫిర్యాదు చేయడానికి బాలికలు ముందుకు రాకపోవడంతో పోలీసులే వారి నుంచి వాంగ్మూలం తీసుకుని కేసు నమోదు చేశారు. ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. కొద్దిరోజుల క్రితం ఇదే మధ్యప్రదేశ్‌లోని అలిరాజ్‌పూర్‌ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ యువతిని చెట్టుకు వేలాడదీసి కొట్టిన వీడియో వైరల్‌ అయ్యింది. మహిళల పట్ల ఇలా దారుణంగా వ్యవహరించడంపై పలువురు మండిపడుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని