హైదరాబాద్‌లో దారుణం: ఓ వ్యక్తి పెళ్లి సమస్య.. ఇద్దరి ప్రాణాలు తీసింది!

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి పెళ్లి సమస్య ఇద్దరు ప్రాణాలను తీయగా.. మరొకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

Updated : 12 May 2022 17:35 IST

బాచుపల్లి: హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి పెళ్లి సమస్య ఇద్దరు ప్రాణాలను తీయగా.. మరొకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

వినాయక్‌నగర్‌కు చెందిన శ్రీకర్‌కు వివాహం జరగడం లేదనే ఆవేదన గత కొంతకాలంగా ఆయన కుటుంబంలో ఉందని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలోనే గురువారం శ్రీకర్‌ తల్లి లలిత (56), అతడి సోదరి దివ్య (36) ఆత్మహత్యకు పాల్పడాలనుకున్నారు. దివ్యకు ఏడాదిన్నర కుమారుడు శివకార్తికేయ ఉన్నాడు. తాను చనిపోతే కుమారుడు అనాథ అవుతాడనే కారణంతో శివకార్తికేయను గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాత దివ్య, ఆమె తల్లి లలిత ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో లలిత మృతిచెందగా.. ఉరివేసుకోవడానికి ఉపయోగించిన చున్నీ తెగిపోవడంతో దివ్య కిందపడిపోయింది. దీన్ని గమనించిన శ్రీకర్‌.. ఘటనపై బాచుపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం దివ్యను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. శ్రీకర్‌కు పెళ్లికావడం లేదనే మనస్తాపంతోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన అనంతరం వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని