Crime Thriller: ఏడేళ్ల క్రితం ‘చనిపోయిన యువతి’ బతికొస్తే..!

ఏడేళ్ల క్రితం అదృశ్యమైన ఓ బాలిక.. హత్యకు గురైందని భావించారు. ఇందులో ఓ యువకుడిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. అతడిపై కేసు నమోదు చేయడంతో జైలుకి వెళ్లాల్సి వచ్చింది. పోలీసుల దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తం చేసిన నిందితుడి తల్లి.. అదృశ్యమైన యువతి కోసం సొంతంగా గాలించగా ఇటీవలే ఆమె కంటపడింది.

Published : 07 Dec 2022 19:02 IST

లఖ్‌నవూ: ఓ 15ఏళ్ల బాలిక ఏడేళ్ల క్రితం అదృశ్యమయ్యింది. ఆమెను కిడ్నాప్‌ చేశాడనే అభియోగాలపై ఓ యువకుడు అరెస్టయ్యాడు. ఆమె మరణించిందని దర్యాప్తులో పోలీసులు తేల్చడంతో నిందితుడికి శిక్ష కూడా పడింది. అయితే, చనిపోయిందని భావించిన ఆ యువతి (22) తాజాగా బతికుండటాన్ని బాధితుడి తల్లి గుర్తించింది. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో రంగంలోకి దిగి ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ మాదిరి ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

యూపీలోని అలీగఢ్‌కు చెందిన ఓ బాలిక 2015లో కనిపించకుండా పోయింది. దీంతో స్థానిక గోండా పోలీస్‌ స్టేషన్‌లో బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. కిడ్నాప్‌, బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకోవడం (ఐపీసీ 363, 366సెక్షన్ల కింద) వంటి అభియోగాలపై ఓ యువకుడిపై కేసులు కూడా నమోదు చేశారు. కొంతకాలం తర్వాత ఆగ్రాలో ఓ యువతి హత్యకు గురయ్యిందన్న విషయం తెలుసుకున్న బాధితురాలి తండ్రి.. అది తన కూతురేనని పేర్కొన్నాడు. దీంతో పోలీసులు హత్య కేసుగా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఈ కేసులో విష్ణు( ప్రస్తుతం 25 ఏళ్లు) అనే యువకుడిపై అభియోగాలు మోపడంతో అతడు జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

అయితే, పోలీసుల దర్యాప్తుపై మొదటినుంచి అనుమానాలు వ్యక్తం చేస్తోన్న నిందితుడి తల్లి.. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సొంత ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో హథ్రాస్‌లో ఇటీవల ఓ మతపరమైన కార్యక్రమంలో..  ఏడేళ్ల క్రితం తప్పిపోయిన ఆ యువతి ఈ మహిళ కంటపడింది. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేసింది. దీంతో ఆ యువతిని అలీగఢ్‌లో అదుపులోకి తీసుకొని స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేసేందుకు తొలుత డీఎన్‌ఏ ప్రొఫైలింగ్‌ను పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. యుతతితోపాటు ఆమె తల్లిదండ్రుల నమూనాలను సేకరించామని.. డీఎన్‌ఏ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. ఇక ఈ ఘటనపై విలేకరులతో మాట్లాడిన నిందితుడి తల్లి.. ‘నా కుమారుడిని ఈ కేసులో ఇరికించారని నాకు తెలుసు. తనను నిర్దోషిగా నిరూపించేందుకే సొంతంగా ప్రయత్నాలు చేస్తున్నాను’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని