Viral news: పోలీసులే నేరగాళ్లు.. వ్యాపారి కాళ్లు పోవడానికి కారణం వాళ్లే!

పోలీసుల అత్యుత్సాహం ఓ చిరువ్యాపారి కాళ్లు కోల్పోయేలా చేసింది. త్రాసును పోలీసులు రైలు ట్రాక్‌పైకి విసిరేయడంతో దానిని తిరిగి తెచ్చుకునే క్రమంలో రైలు ఢీ కొట్టింది. ఈ ఘటన కాన్పూర్‌లో చోటు చేసుకుంది.

Updated : 03 Dec 2022 16:36 IST

లఖ్‌నవూ: వాళ్లంతా నిరుపేదలు. ఏవో  చిరువ్యాపారాలు చేస్తూ బతుకీడ్చుకొస్తున్నారు. అలాంటి వారిపై పోలీసులు జులుం ప్రదర్శించారు.‘ఈ స్థలం మీది కాదు..వెంటనే ఖాళీ చేయండి’ అంటూ హుకుం జారీ చేశారు. ఎదిరించి మాట్లాడిన వ్యక్తిపై చేయి చేసుకున్నారు. అతడి తక్కెడను రైల్వే ట్రాక్‌పైకి విసిరేశారు. తిరిగి తెచ్చుకునేందుకు వెళ్లిన అతడిని అటువైపుగా వస్తున్న రైలు ఢీ కొట్టడంతో రెండు కాళ్లూ కోల్పోయాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటు చేసుకుంది.

పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కాన్పూర్‌  రైల్వేస్టేషన్‌ సమీపంలో కొందరు వ్యక్తులు చిరువ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, వారిని ఖాళీ చేయించేందుకు శుక్రవారం ఉదయం ఇద్దరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో అడ్డుపడిన అర్సలాన్‌ (18) అనే యువకుడిపై చేయి చేసుకున్నారు. పక్కనే ఉన్న హెడ్‌కానిస్టేబుల్‌ రాకేశ్‌ అతడి త్రాసును రైల్వే ట్రాక్‌పైకి విసిరేశాడు. కంగారు పడిన అర్సలాన్‌ దానిని తిరిగి తెచ్చుకునేందుకు వెళ్లాడు. అంతలోనే ఎదురుగా వస్తున్న రైలు ఢీ కొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే పోలీసులు అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. నుజ్జునుజ్జయిన అతడి రెండు కాళ్లను వైద్యులు తొలగించారు. ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్‌ కావడంతో ఉన్నతాధికారులు రాకేశ్‌పై చర్యలు తీసుకున్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అతడిని సస్పెండ్‌ చేసినట్లు వెల్లడించారు. కేసుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నట్లు వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని